- సాంబయ్య గుండిమెడ
కమ్యూనిస్ట్, నక్సలైట్, హేతువాద, దళిత, స్త్రీవాదులు నడిపిన సామాజిక, సాహిత్య ఉద్యమాలు తెలుగు జాతిని ముఖ్యంగా సామాజిక పీడనకు, రాజకీయ అణచివేతకు, ఆర్థిక దోపిడికి గురైన వర్గాలలో ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిని ఆవిష్కరించాయి. ఈ ఉద్యమాల చైతన్య జవసత్వాల అధారంతో తరతరాలుగా సామాజిక అణచివేతకు, అవమానానికి గురై, అంధకారంలో అలమటించిన మాదిగలు ఏ కులం పేరుతో తాము అవమానించబడ్డారో అదే కులాన్ని భూమికగ ‘దండోరా’ పేరుతో ఒక మహోన్నతమైన సామాజిక ఉద్యమాన్ని నడుపుకున్నారు.
ఊరి చివరకు నెట్టివేయబడి, మానవీయతను కోల్పోయి, భీతితో సిగ్గుతో అవమాన భారంతో ఆలోచనలు లేని పశు పక్ష్యాదుల మాదిరి బ్రతుకీడుస్తున్న కులాల, వాటి సంస్కృతులను ఊరి మధ్యకు, ప్రజా బాహుల్యంలోకి తెచ్చారు. యిలా తేవడం అంటే అవమానింపబడ్డ కులాలకు, కుల జీవన సంస్కృతులకు గౌరవాన్ని ఆపాదింపజేసుకోవడం. అది ఒక సామాజిక చారిత్రక అవసరం. ఆ అవసరాన్ని సాధించడంలో, సామాజిక సమానత్వాన్ని ప్రతిస్ఠాపిత దిశగా దండోర ఉద్యమ కృషి అనన్యం అసమాంజసం. ఈ ఉద్యమ చైతన్యం కులమదాంధుల గర్వానికి చిల్లులు పెడితే, కుల బాధితులకు మనో ధైర్యాన్నిచ్చింది. కులం పేరు చెప్పుకోవడానికి లజ్జతో చచ్చిన ఎందరో ఈనాడు తమ పేర్ల ప్రక్కన కులాన్ని జత పరచుకొని కులానికి వ్యతిరేకంగా నిలబడే సామాజిక నిబ్బరాన్ని కలిగించింది. దండోర ఉద్యమ నాయకులుగా కృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగలు జాతిలోనూ అణగారిన జాతులలోనూ రగిలించిన ఆవేశానికి రేకెత్తించిన ఆలోచనలకు మాదిగ జాతి హృదయ ఫలకాలపైనా, తెలుగు జాతి చరిత్ర గ్రంధ చిఠాలలోనూ ఒక సుస్థిరమైన స్థానాన్ని లిఖింపజేసుకున్నారు.
అయితే, ఈ మధ్య కాలంలో మాదిగల, మాదిగ దండోర నాయకుల ఆలోచన సరళులను, వ్యవహార విషయాలను జాగ్రత్తగా గమనిస్తే రెండు రకాల అనాలోచిత, అసంధర్భ ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి, తెలుగు దేశం, కాంగ్రేసు పార్టీల పదమూడు సంవత్సరాల సుదీర్ఘ వంచన తరువాత కూడా ఒక్కొక్క పర్యాయం యాచిస్తూ, యింకొక్క పర్యాయం బెదిరిస్తూ వాటినే నమ్ముకొని, అంటిపెట్టుకొని వర్గీకరణ కోసం ఎదురు చూడడం. రెండు, సామాజిక చారిత్రక అవసరార్ధం ఊరి మధ్యకు తెచ్చిన ఊరి చివరి బ్రతుకుల చుట్టే తమ జీవిత పోకడలను, ఆలోచనలను అల్లుకుంటూ ఒక కృత్రిమ స్పృహలో బ్రతకడం. ఇదే యింకో రకంగా చెప్పాలంటే, ఊరి చివరి రోదన బ్రతుకులను రొమాంటిసైజ్ చెయ్యటం. జయప్రభ గారి ‘పద పొరపాట్లు చేద్దాం’ (ఆంధ్రజ్యోతి, 2 ఏప్రిల్, 2007) కవితకు స్పందిస్తూ కృపాకర్ మాదిగ గారు వ్రాసిన ‘మా గూడెంలోకి రా’ (ఆంధ్రజ్యోతి, 16 ఏప్రిల్, 2007) గూడెం బ్రతుకులను రొమాంటిసైజేషన్ చేసే ప్రయత్నమే. ఈ వ్యాసంలోని చర్చ రెండవ అంశం మీద కేంద్రీకరించబడింది.
రెండవ అంశంపైన చర్చ ప్రారంభించేముందు మొదటి అంశంపై నా అభిప్రాయం: రాష్ట్రంలో రాజ్యాధికారం కమ్మల అధినేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ; రెడ్ల ఆధిపత్యంలోని కాంగ్రేసు పార్టీల మధ్య అట్ల తద్ధి రోజున యిచ్చి పుచ్చుకునే వాయినంలా వారినుండి వీరికి, వీరి నుండి వారికి మధ్య చేతులు మారినంత కాలం వర్గీకరణ సాధ్య పడదు. రాజ్యాధికారం వీరిరువురుల చేతులనుండి మూడవ చేతికి వెళ్ళే అవకాశం సమీప భవిష్యత్తులో కానరానందున, కనిపిస్తున్న ఒకే ఒక మార్గం రాష్ట్ర వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ ని ‘తెలంగాణ’, ‘ఆంధ్ర’ లుగా వర్గీకరించబడినప్పుడు ‘దళిత రిజర్వేషన్ల వర్గీకరణను’ సున్నితంగా సాధ్యపరచుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ విభజనకి, వర్గీకరణకు గల సంబంధాన్ని మరొక వ్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఈ వ్యాస దృష్టి రెండవ అంశంపైన సారించడానికి రెండు కారణాలున్నాయి. కృపాకర్ కవిత ఒక కారణమయితే, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం మాదిగ పరిశోధనా విద్యార్ధుల రచనలు మరొక కారణం. దండోరా ఉద్యమ తొలి రోజుల్లో ఈ విశ్వ విద్యాలయం మాదిగ సాహిత్యానికి మజిలీ. కీర్తి శేషి నాగప్పగారి సుందరరాజు గారి అధ్యక్షతన ‘మాదిగ సాహిత్య వేదిక’ ని స్థాపించుకొని యుతులు కత్తి కళ్యాణ్ చంద్ర, కొలికపూడి శ్రీనివాస రావు, డా. దార్ల వేంకటేశ్వర రావు, డా. కట్టెపోగు సురేష్ గార్లు యింకా ఎందరో మాదిగ మేధావులు, విద్యార్థులు మాదిగ జాతి, దాని సంస్కృతిపైన కొన్ని విలువైన సంకలనాలు వెలువరించారు. ఆ రోజున వారు వెలువరించిన సాహిత్యం ఒక చారిత్రక అవసరం. అనాటి చారిత్రక అవసరం ఈనాడు లేకపోయినప్పటికీ విశ్వ విద్యాలయంలో ఎందరో మాదిగ రీసర్చ్ స్కాలర్ లు (విశ్వ విద్యాలయం బయట ఎందరో) ‘చెప్పు, డప్పు’ అంశాలు ప్రధానంగా పుంఖాను పుంఖానులుగా కవిత్వాలు వ్రాయడం.
చారిత్రక అవసరత, సామాజిక ప్రయోజనం కానరాని వీరి వర్తమాన రచనలను ముఖ్యంగా కృపాకర్ ఆలోచనాభిప్రాయాలు కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జాతి నాయకుడిగా అతను వ్యక్త పరచిన అభిప్రాయాలు అతని జాతి జనుల ఆలోచనలపైన, వారి ఆలోచన విధానంపైన ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఈ ఆలోచనలే వారి జీవిత దిశని - దశని నిర్ధేశిస్తాయి. అట్టి ఆలోచనలు ఆ జాతి జీవన గమనానికి కర దీపాలు కావచ్చు - కర దూపాలూ కావచ్చు. ‘మా గూడెంలోకి రా’ కవితలో వ్యక్తం కాబడ్డ ఆలోచనను ఒక నమూనాగా తీసుకుని, మాదిగల ప్రగతికి అడ్డుగా నిలిచే ఈ ఆలోచన విధానం నుండి బయట పడవలసిన సామాజిక చారిత్రిక అవసరతను చెప్పడం ఈ వ్యాసంయొక్క ప్రధాన ఉద్ధేశం. ఈ ఉద్ధేశాన్ని వివరించే నిమిత్తం రెండు అంశాలను ప్రధానంగా స్వీకరించి రెండు స్వతంత్ర భాగాలలో వానిని చర్చించడం జరిగింది. మొదటి భాగంలో గూడెం రొమాంటిసైజేషన్ ఏ విధంగా మాదిగల ప్రగతికి ప్రతిబంధకం అవుతుందో చెప్పబడింది. గూడేం రొమాంటిసైజేషన్ కుల వ్యస్థను పరోక్షంగా ఏ విధంగా పటిష్టపరుస్తుందోనన్నది రెండవ భాగంలోని చర్చాంశం. ముగింపుగా కాలంతో పొంతనలేని, తిరోగామ ప్రేరకమైన రొమాంటిసైజేషన్ మానుకొని, వర్తమానంలో ప్రపంచీకరణ తెచ్చిన మార్కెట్ వ్యవస్థలోకి, ఆధునిక వృత్తులలోకి మాదిగల ప్రవేశంపై దృష్టి పెట్టవలసినదిగా నివేదించడం జరిగింది.
గూడె సంస్కృతి రొమాంటిసైజేషన్ ఎటు దారి తీస్తుంది?
గూడెం జీవితానికి, దాని చుట్టూ అల్లుకున్న జీవన సంస్కృతికి ఔన్నత్యాన్ని ఆపాదించుకునే నిర్మాణాత్మక చర్య అనే మిథ్యలో కృపాకర్ గూడెంలోని వివిధ వాసనల (మన్ను వాసన, పసరు వాసన, చెమట వాసన) గురించి, పలు రకాల భోజనాల ( కాల్సిన ఈరిగెలు, దొబ్బల సియ్యల కూర, సంకటి ముద్దలు, పుల్ల నీళ్ళు, రొయ్యల కారం ) గురించి, చంటి పిల్లలు వారి ఆట పాటల (సీమిడి బుగ్గలు, లల్లాయి పాటలు, మూకుడు తప్పెట్లు) గురించి, యింకా ప్రకృతికి దగ్గరగా ఉండే స్వేచ్చా జీవితం గురించి, గూడెంలోని మనుష్యుల మధ్య పరిఢవిల్లే సహాయ సహకారాల గురించి ఎంతో హుందాగా చెప్పుకున్నారు. ఒక విధంగా అధునిక జీవన ఆరాటంలో అలసిపోయిన బయటివారు గూడేనికి వెళితే మనసుకు స్వాంతన కలుగుతుందని భావించేటట్లుగా, గూడెంలోనివారు ‘నిజంగా మాజీవితాలు అంత మధురంగా ఉంటాయోమోననే’ విశ్వాసం కలిగేంతగా రొమాంటిసైజ్ చెయ్యడం జరిగింది.
అయితే, యిటువంటి రొమాంటిసైజేషన్ కవి ఆశించిన ఫలితాన్ని సాధించకపోగా అది గూడేలలో ఉండే మాదిగ ప్రజలకు తిరోగామ ప్రేరకమవుతుంది. యిది ఎలాగో చెప్పేముందు కొన్ని ‘కామన్ సెన్సె’ ప్రశ్నలు అడుగుతాను. నగర నాగరికతలో ఎన్ని అగ్రహారాలున్నాయి? అధునిక ఆర్థిక వ్యవస్థలో, ఉద్యోగ వత్తుడులలో ఎంత మంది బ్రాహ్మణులు ‘మంత్రాల కట్టుబాట్ల కట్లు మడులలో’ బ్రతుకుతున్నారు? ‘సంకటి ముద్దలు, పుల్ల నీళ్ళు, ఎండు తలకాయల కారం, సింతాకుపొడి రొయ్యల కారం’ - యిదే కదా గూడెంలో దొరికే భోజనం! ‘గొప్ప భోజనం’ అని చెప్పుకోవడానికి ఏముంది యిందులో ‘గొప్ప’? అసలు ఎందరు మాదిగలు ఈనాడు సంకటి ముద్దలు తిని బ్రతుకుతున్నారు? ఒక వేళ బ్రతుకుతున్నా, ఆ సంకటి ముద్దల రుచి వలనా లేక, పప్పు భోజనాలు, బెండకాయ వేపుళ్ళు, దొండకాయ యిగుర్లు, కోడి మాంసాలు, వేట పలావులు వండుకు తినే ఆర్థిక స్ఠోమత లేకనా? చంటి పిల్లలకు చీమిడి వస్తే శుభ్రం చేస్తారా లేక, అదేదో అమూల్యమైన పదార్ధంలా అలాగే ఉంచుతారా? ‘మా పిల్లల చీమిడి మాకు ముద్ధు’ అని వితండవాదం చేస్తే, ఆ చీమిడి మీద ఈగలు వాలి చంటి పిల్లల ఆరోగ్యంతో పాటు పరిసరాల ఆరోగ్యం కూడా నాశనం చేయడం కాదా? యింకా, చీమిడి పాముకున్న బుగ్గలతో మూకుడు తప్పెట్లు వాయిస్తూ లల్లాయి పాటలు పాడే బదులు పరిశుభ్రమైన స్కూల్ యూనిఫాంలో పాలుగారే బుగ్గలతో ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ‘ (లేదా యింకేదైనా) అని అన్ని కులాలవారి పిల్లలలాగా మాదిగ బుజ్జి తల్లులు - మాదిగ బుజ్జిగాళ్ళు పాడుతుంటే చూడాలనే ఆశ - ఆకాంక్ష మాదిగలకు కలగదా? ‘కుక్కలకు బొక్కలెయ్యడం, కోడికి గింజలెయ్యడం, దూడకి మేతయ్యడం, పిల్లికి ముద్ధెయ్యడం’ - లాంటివి గూడెం వాళ్ళే చేస్తారా లేక, యితరులు కూడా చేస్తారా? ఒక వేళ గూడేం వాళ్ళు మాత్రమే చేస్తారనుకుంటే - ఈ పనులకు పరిమితమవ్వడమేనా గూడెం మనుష్యుల జీవితం, ఆ జీవితార్థం? - యివి సాధారణ ప్రశ్నలు. అయితే, ఈ సాధారణాలే గూడే జీవితాన్ని ఆకళింపు గావించే సాధనాలు.
గూడెం రొమాంటిసైజేషన్ ఏ విధంగా తిరోగామ ప్రేరణోనని ‘ఆకాక్ష ‘ అనే ఒక భావన, ‘ప్రపంచీకరణ’ అనే ఒక సంధర్భం అసరాగా చర్చించే ముందు కవితలో పొడవడిన ఒక అపసవ్యం గురించి, కవితలో అలోచనను సంగ్రహంగావించే ఒక సైద్ధాంతికపర అంశాన్ని క్లుప్తంగానైనా మాట్లాడవలసి ఉంది. మనిషి చేసే ప్రతి పనికి ఒక హేతువుంటుంది. కాని కుల సమాజంలో హేతువు లేకుండా చేసే పనులలో ముఖ్యమైన పని స్వకుల స్తుతి పరకుల నింద. కవితలో బ్రాహ్మణులపై వ్యక్తపరచబడిన అసహ్యం ఈ ధోరణినే ప్రతిబింబిస్తుంది. ‘మాదిగ దండోరా: ఏడు వ్యాసాలలో’ ఉధ్ఘాటించిన ఉన్నాతాభిప్రాయాలతో పోలికే లేని ‘మా గూడెంలోకి రా’ కవితలో ధ్వనించిన కుల స్వరం నన్ను విచారగ్రస్తుడిని చేసింది. బ్రాహ్మణులపై వ్యక్తపర్చిన ఈ అసహ్యం మాదిగల ఔన్నత్యాన్ని ఏ విధంగా ప్రకాశవంతం గావిస్తుందో అర్ధం కాదు! మాదిగ కులంలో పుట్టడం మాదిగల తప్పు ఎలాకాదో బ్రాహ్మణ కులంలో పుట్టడం కుడా బ్రాహ్మణుల తప్పు కాదు. తప్పు పట్టవలసింది, అసహ్యించుకోవలసింది ఆ మనుష్యులకు వారు ఫలానా కులానికి చెందిన వారని నమ్మేటట్లు గావించిన కుల వ్యవస్థ భావజాలానిది. ‘బ్రాహ్మణులపైన కాదు - బ్రాహ్మణ భావజాలంపైన మా పొరాటం’ అని అంబేద్కర్ చెప్పినా, ‘పురుషులపై కాదు - పురుషాధిక్య వ్యవస్థ పై మా పొరాటం’ అని జయప్రభ (డా. యస్.వి. సత్యనారాయణ. (సంపా.), 1997. ‘స్త్రీవాద వివాదాలు.’ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, పే. 113-120) చెప్పినా ఒకటే సారంశం: ‘మనుష్యులపైన కాదు. మనుష్యులను మనుష్యులుగా గాక ఆధిక్యత గలవారుగా, ఆధిక్యత లేనివారుగా తయారు చేస్తున్న వ్యవస్థలు, వాటి భావజాలాల పైనే పోరాటం’. ఈ విషయంలో కృపాకర్ నాతో ఏకిభవించకపోవడానికి ఎటువంటి కారణం ఉండదని ఆశిస్తాను.
సైద్ధాంతికపర ఆలోచన:
సాధారణంగా ప్రతి వ్యక్తి తన ప్రాధమిక అవసరాలు (భోజనం, వస్త్రం, నివాసం) తీర్చుకున్న తరువాత చేపట్టే పని (పనులు) రెండు విషయాల ఆధారంగా చేస్తాడు. ఒకటి, ఏదేని ఒక పనిని లేదా ఒక విషయాన్ని ‘గొప్పదిగా’ తాను స్వయంగా నమ్మినపుడు; రెండు, సమాజంలో తాను గొప్పవారు అనుకున్నవారు చేసిన, చేస్తున్న పనుల ద్వారా. అంటే, వారు గొప్పవారు కాబట్టి వారు చేసే పనులు కూడా గొప్పవని భావించడం. విషయాలకు (లేదా వ్యక్తులకు) ఒక్కసారి ‘గొప్పతనం’ ఆపాదించిన తరువాత వ్యక్తి ఆలోచనలు ఆ గొప్ప విషయం చుట్టూతే పరిభ్రమిస్తాయి. ఆ మేరకు ఆ వ్యక్తి అలోచనలు యితర విషయాలవైపు మళ్ళడం అరుదుగా జరుగుతుంది. ఈ అలోచన అధారంగా ‘గొప్పతనం’, ‘ప్రయోజనం’ లేని విషయాలకు ‘గొప్ప’ అపాదించుకోవడం వలన అట్టి చర్యలు వ్యక్తులలో గొప్ప విషయాలను సాధించాలనే ‘ఆకాంక్షను’ ఎలా అదిమిపెడతాయో క్రింద చెప్పడం జరిగింది.
ఒక మనిషిగాని, ఒక సమాజంగాని లేదా ఒక దేశంగాని ప్రగతి సాధించాలంటే అందుకు ముందుగా కావలిసిన ముడి సరుకు ప్రగతి సాధించాలనే ‘ఆకాంక్ష’. ఒక స్కూటరో, ఒక కారో నడవడానికి చమురు ఎలా అవసరమో, మనిషి చలనానికి ఆకాంక్ష అంతే అవసరం. చమురు లేకుంటే మోటారు యంత్రం నడవనట్లే ఆకాంక్ష లేకుంటే మనిషి యంత్రం కూడా నడవదు. అంటే మనిషి చలనానికి చమురుగా పనిచేసేదే ఆకాంక్ష. ఊరి చివరకు నెట్టివేయబడ్డ వారు ఊరి మధ్యకు రావాలనే ఆకాంక్ష ఉండబట్టే శతాభ్దాలుగా అణిచివేతకు గురికాబడ్డవారి అరాటాలూ పోరాటాలు. కాని, ఈ రోజున బయటి వారిని గూడెంలోనికి రమ్మనే ఆలోచన , గూడెంలో ఉన్న వారిని గూడెంలోనే ఉండి పొమ్మనే భావన, సంకటి ముద్దల గురించి, రొయ్యపొట్టు కారాల గురించి గొప్పగా చెప్పుకోవడమంటే - గూడెం గుడిసెలలోఉన్నవారు గృహాలలోనికి మారాలనే, రుచికరమైన ఆరోక్యకరమైన భోజనాలు చెయ్యాలనే ఆకాంక్షలు లేకుండా చేయడమే. అభివృద్ధికి నోచుకోని వ్యక్తులుగాని, కులాలుగాని అభివృద్ధి చెందిన వ్యక్తుల, కులాలకు మించి లేదా, కనీసం వారి చందంగానైనా ఎదగాలనే ఆకాంక్ష, చైతన్యం కావాలి. కాని గూడెం రొమాంటిసైజేషన్ యిప్పటివరకు అంతో - యింతో సాధించిన ప్రగతిని కూడా కాలదన్ని కాలం వెనుకకు మళ్ళించే తిరోగామ ప్రేరణ. ఇంకా చెప్పాలంటే, రొమాంటిసైజేషన్ లాజిక్కు ఎంతవరకు దారి తీస్తుందంటే ఒకానొకప్పుడు గూడెంలోని మగవారి మొలలకు గోసిగుడ్డలు మాత్రమే ఉండేవి. కాబట్టి యిప్పుడు గూడెంలో ఉంటున్న మగవారు కూడా గోసెలే కట్టుకోండి - అనేంతవరకు.
ప్రపంచీకరణ సందర్భం:
ప్రతి సమాజంలో అభివృద్ధి చెందిన - చెందని రెండు వర్గాలు (వాంఛితం కాకున్నా) ఉంటాయి. అభివృద్ధి చెందిన వర్గాలే కాల క్రమేణా ఆధిపత్య వర్గాలుగా రూపాంతరం చెందడం కూడా జరుగుతుంది. అభివృద్ధి చెందే దశలో కాల మాన పరిస్థితులు, సంధర్భాలు అందించే అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడం జరిగితే, అభివృద్ధి చెందిన పిదప అవకాశాలను తాము మాత్రమే పొందే విధంగా వ్యవస్థలను రూపొందించుకొని ఆధిపత్య వర్గంగా (వర్గాలుగా - కులాలుగా) వ్యవస్థాపితం చేసుకోవడం జరుగుతుంది. మన చర్చ అభివృద్ధికి నోచుకోని మాదిగల గురించి గాబట్టి ‘ఆధిపత్య’ అంశాన్ని ప్రక్కన ఉంచుదాం. ఇప్పుడు మనం ఉంటున్న కాల సందర్భం మార్కెట్టు చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రపంచీకరణ. మార్కెట్లో ప్రతి వస్తువుకి ఓ వెల ఉన్నట్లే ఈ ప్రపంచీకరణ వ్యవస్థలో ప్రతి వ్యక్తికి ఓ ధర ఉంటుంది. ఆ ధర రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకొని నిర్ణయించబడుతుంది: వ్యక్తి నైపుణ్యత, ఆ నైపుణ్యాన్ని విక్రయించి దానితో లాభాలు గడించగలిగే తీరు. ఇక్కడ ఒక అవ్యక్తమైన అంశం ఉంది. లాభాలు గడించగలగడమంటే వ్యక్తి తన నైపుణ్యతతో వస్తువు తయారు చేసినప్పటికినీ ఆ వస్తువును కొనే మార్కెట్టు (జనాభా) కూడా ఉండాలి. అంటే ఆర్థిక శాస్త్ర పరిభాషలో ‘సరఫరాతో పాటు గిరాకి కుడా ఉండాలి.’ గిరాకి లేని వస్తువును ఏ వ్యాపారి తన కొట్టులో ఉంచి అమ్మనట్లే, అమ్మబడలేని, లాభాలు గడించలేని ఏ నైపుణ్యానికి ప్రపంచీకరణలో స్థానం లేదు.
అయితే, ‘మార్కెట్లో అమ్ముకొనేందుకేనా వ్యక్తి నైపుణ్యత? ఒక్కొక్క పర్యాయం నైపుణ్యతను మనుష్యులు ఆత్మ సంతృప్తి కొరకు సాధిస్తారు’. ఈ వాదన ఎల్లరకు తెలిసినదే. ఆత్మ సంతృప్తి ఆర్ధికంగా స్థిరపడిన వారికి - అసలు ఆర్ధికతే లేనివారికి ఆత్మ సంతృప్తి పొందాలనే ఆరాటం ఎక్కడనుండి కలుగుతుంది? రెక్కాడితేగాని డొక్కాడని మనుష్యులకు ‘ఆత్మ సంతృప్తి’ అనే ఓ అందమైన భావన ఒకటుందని, ఆ భావనను సాక్ష్యాత్కరింపజేసుకోవచ్చుననే ఆలోచన ఎక్కడనుండి పుడుతుంది? ఇటువంటి అకడమిక్ ఆలోచనలు మన చర్చను ఏ దరికి చేర్చవు, కాబట్టి ఈ వాదనలను ప్రక్కన ఉంచుదాం.
ప్రపంచీకరణ జరగడానికి ముందే లాభదాయకమైన మాదిగ చెప్పుని అభివృద్ధి చెందిన కులాలు చెప్పుల ఫ్యాక్టరీలు స్థాపించి హస్తగతం చేసుకోగా, ఆధునిక సాంకేతికత (రేడియో, టి.వి., యాడ్ ఏజెన్సిలు మొదలైన వాటి రూపాలలో) మాదిగల దండోరా పనిని సాంకేతిక నైపుణ్యత సాధించిన కులాల స్వంతం చేసింది. కుల వృత్తులు కోల్పోయి, ఆధునిక వృత్తులకవసరమైన నైపుణ్యాన్ని సాధించుకోలేక మాదిగ బ్రతుకులు ఎప్పుడో శుష్కించుకుపోయాయి. యిప్పటి మార్కెట్టు సమాజంలో పురాతన కాలంనాటి మాదిగ చెప్పుకి మార్కెట్టు లేదు. లేని మార్కెట్టుని సంపాదించుకోవాలంటే ప్రస్తుతం చెప్పుల తయారీలో ప్రసిద్ధి పొందిన బాటా, కరోనా లాంటి సంస్థల కంటే మన్నికగా, ఆ సంస్థలు అందించే ధరలకంటే (కనీసం వాటి విధంగానైన) తక్కువకి మాదిగలు చెప్పులు తయారి చేయాలి. అలా చేసిన రోజు మార్కెట్టులో వారి చెప్పుకి గిరాకి దొరుకుతుంది. అయితే, అలా మన్నికగా తయారుచేసి, చవుక ధరలకు విక్రయించగల సాంకేతిక నైపుణ్యం, ఆర్ధిక సంపత్తి - రెండూ మాదిగల దగ్గర లేవు. మాదిగల డప్పు పరిస్థితి కూడా వారి చెప్పు స్థితికంటే భిన్నంగానేమి లేదు. సాంప్రదాయ, జానపద, సాంస్కృతిక కళల ప్రోత్సాహం పేరుతో ఆ కళలే పెట్టుబడిగా నగరాలలో వ్యాపారం చేస్తున్న సాంస్కృతిక సంస్థల సంస్థానాలలో పలు కులాల కళా రూపాలలో మాదిగ డప్పు ఓ రూపం. లేదా ఎన్నికలప్పుడు, ఎన్నికలులేనప్పుడు పలు రాజకీయ పార్టీలు జరుపుకునే మహానాడు, మిని మహానాడులలో అనేకానేక ప్రజాకర్షక సాధనాలలో ఓ సాధనం మాదిగ డప్పు. అంతకు మించి తమ డప్పు ద్వారా మాదిగలు రువ్వుకుంటున్న రూకలేమీ లేవు.
ఆర్ధిక ప్రయోజనం లేని డప్పులను - చెప్పులను నెత్తికెక్కించుకొని కడుపులు మాడ్చుకోవడంకంటే వాటిని అటకలకెక్కించడం జరగాలి. ప్రత్యామ్నాలు ఆలోచించించడంతోపాటు, ఆధునిక వృత్తులలో నైపుణ్యతను సాధించే మార్గాలను అన్వేషణ చేసి బక్కచిక్కిన బ్రతుకులను బలోపేతం చేసుకోవాలి. పైన పేర్కొన్నట్లుగా అభివృద్ధి కాల సంధర్భాలు అందించే అవకాశాలను అందుకోవడంలో, అందుకోవాలనే ఆలోచనలలో, ఆకాంక్షలలో ఉంది. అంటే కాలానుగుణంగా తమను తాము సంస్కరించుకొని మార్పు చెందటంలో వ్యక్తుల, సమూహాల లేదా కులాల అభివృద్ధి అధారపడిఉంది. అలా జరగనినాడు చెరువులోని పాత నీరు పోయి కొత్త నీరు రాకుంటే ఆ పాత నీటికి పాచి పట్టి కొంత కాలానికి మురుగుగా మారడం ఎంత సత్యమో, మారని మనుష్యులు వారి ఆలోచనలకు తెగులు పట్టి కాల క్రమంలో భ్రష్టు పట్టడం కూడా అంతే సత్యం. మాదిగలు కాలంతో మారకుండా డప్పు, చెప్పు, గూడెం - దాని సంస్కృతి అంటూ సాంస్కృతిక విషయాలచుట్టూ తమ ఆలోచనలను పరిభ్రమింపజేసుకుంటూ కాలంతో (తమ వర్తమానంతో) పొంతనలేని సృహలోకి తమను తాము జోకొట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సాంస్కృతిక అంశాల ఆవశ్యకతను నేను తక్కువ అంచనా వెయ్యడం లేదు. కాని మాదిగలకున్న శతకోటి సమస్యలను ఏక కాలంలో పరిష్కరించుకోవాలనే ఆలోచన, వారికున్న మేధా సంపత్తి, ఆర్ధిక స్థితిగతుల పరిమితుల దృష్ట్యా సరికాదు. ఉన్న వనరులు వినియోగించి నూతన వనరులు సాధించుకోవాలంటే సమస్యల ప్రాధాన్యతననుసరించి వనరులను కేటాయించుకొని ఆ దిశగా కృషి చేయాలి. కాని అలా జరుగకుండా గూడెపు రోదన బ్రతుకులను, గతించిన వృత్తులను రొమాంటిసైజ్ చెయ్యడం జరుగుతుంది. అట్టి రొమాంటిసైజేషన్ అభివృద్ధి సాధనకు కావలసిన ఆలోచనలను ఏ మాత్రం రేకెత్తించక పోగా, సాధించాలనే ఆలోచనల పొంగు మీద నీళ్ళు జిలకరిస్తుంది.
హిందూ మతం కోరుకునేదేమెటి?
గూడెం రొమాంటిసైజేషన్ మార్కెట్ వ్యవస్థలో మాదిగలను మాంద్యులుగా మార్చడమేగాక, హిందూ మత పునాదైన కుల వ్యవస్థకు పరోక్షంగా ద్వార పాలకులుగా మారుస్తుంది. అంటే, గూడెం రొమాంటిసైజేషన్ కుల వ్యవస్థను పరోక్షంగా పటిస్టపరుస్తుంది. ఇలా పటిష్టం కావడమే హిందు మతం కోరుకునేది. ఈ విషయాన్ని కృపాకర్ ప్రస్తావించిన రొయ్యపొట్టు కారం, ఈ మధ్యనే జరిగిన ‘దళిత గోవిందం’ ల అధారంతో ‘డిడక్టివ్ మెథడ్’ లో చెప్పడానికి ప్రయత్నిస్తాను.
గూడె జీవన సంస్కృతి రొమాంటిసైజేషన్లో భాగంగా కృపాకర్ రొయ్యపొట్టు కారం గురించి గొప్పగా చెప్పుకుంటాడు. హిందూ మతానికి కావలిసింది కూడా ఈ రొమాంటిసైజేషనే. ఎందుకంటే, గూడెం జనం రొయ్యపొట్టు కారం గురించి ఆలోచించినంత కాలం - రొయ్యల గురించి ఆలోచన రాదు. రొయ్యల గురించి ఆలోచన రానంత వరకు, రొయ్యల చెరువులు గురించి ఆలోచన రాదు. రొయ్యల చెరువుల గురించి ఆలోచన రానంత కాలం - ఆ చెరువులు వాటి యాజమాన్యం ఆధీనంలోకి ఎలా వెళ్ళాయనే ఆలోచన రాదు. ఆ యాజమాన్యం గురించి ఆలోచన రానంత కాలం - ఆ యాజమన్యాన్ని ఉత్పత్తి, పునరుత్పత్తి చేసే సామాజిక, అర్ధిక, రాజకీయ రంగాలలోని అసమానత్వ చిట్టాల చిక్కుల ఆలోచన రాదు. ఆ ఆలోచన రానంతవరకు గూడెపోళ్ళు గూడెం దాటి బయటకి రారు. వారు గూడెం దాటి బయటకి రాకుండా ఉండడమే హిందు మతానికి కావాలి. అందుకు ఏమి చేయడానికైనా, చివరకు దేవుడ్ని గుడి నుండి గూడేనికి తీసుకు వెళ్ళడానికైనా సంసిద్ధం. మొన్న జరిపిన ‘దళిత గోవిందం’ కూడా ఈ కోవకి చెందిదే.
హిందువేతర మతాల సమానత్వ భావధారలతో సామాజికంగా అణచివేతకు గురికాబడిన కులాలలో వచ్చిన చైతన్యాన్ని నీరుగార్చేందుకు, మతం మార్చుకున్న వారిని తిరిగి తనలో కులుపుకునేందుకు చరిత్ర పొడవునా హిందు మతం చేస్తున్న శతకోటి గారడులలో, మల్లెపల్లి లక్ష్మయ్య గారు అన్నట్లు, ‘దళిత గోవిందం’ ఓ గారడీ! (ఆంధ్రజ్యోతి, 22 ఏప్రియల్, 2007) తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో, యింకా రాష్ట్రంలో క్రైస్తవం పుంజుకుంటుంది. కాబట్టే హిందు మతానికి అకస్మాత్తుగా దళితులు గుర్తుకు రావడం జరిగింది. అంటే ఉత్తరాదిలో ఇస్లాం లేకుండా హిందు మతానికి దళితులు గుర్తుకురానట్లే దక్షిణాదిలో క్రైస్తవం లేకుంటే దళితులు గుర్తోచ్చేవారు కాదు. మరో విధంగా చెప్పాలంటే, హిందువేతర మతాల ప్రాభవంలో తన ప్రాభల్యాన్ని కోల్పోకుండా ఉండడం కోసమే ఈ ‘దళిత గోవిందం’ గాని, శతబ్ధాలుగా ‘అంటరానివారి’ నవస్వప్నం ‘దళిత వసంతం’ కోసం మాత్రం కాదు.
అయితే, “విగ్రహాన్ని దళితుల దగ్గరకు తీసుకు వెళ్ళడం వలన హిందు మతానికి ఒనగూరే ప్రయోజనమేమిటి?” ఈ ప్రశ్నకు సమాధానమే మనం పైన చెప్పుకున్న గూడెం రొమాంటిసైజేషన్ కుల వ్యస్థను ఏ విధంగా పటిస్టపరుస్తుందో చెబుతుంది. దళితులు కూడా సమాజంలో భాగమని, సమానత్వం కలవారని హిందువులు నమ్మినట్లయితే వెంకటేశ్వర విగ్రహ దర్శనార్ధం దళితులను ఆయన ఆలయానికి అహ్వానించి ఉండేవారు. అలాగాక విగ్రహాన్ని దళితుల గూడేలకు, పేటలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇది అంత ఆలోచన లేని, సాధుపూరితమైన (ఇన్నోసెంట్ ) చర్య కాదు. ఈ దేశ సంపదలపై, సామాజిక వనరులపై (దేవాలయం సామాజిక వనరులలోని భాగం) దళితులకూ సమాన హక్కు ఉందని అంగీకరించక పోవడం ఒక కారణమైతే, దళితులు ‘హిందువుల లాంటి’ మనుష్యులు కాదని భావించడం మరొక కారణం. ఈ రెండవ అంశాన్ని మనం కొంత విడమర్చి చెప్పుకోవాలి. ‘దళితులను మనుష్యులుగా’ గుర్తించడం వేరు, ‘దళితులు కూడా తమలాంటి మనుష్యులు’ అని గుర్తించడం వేరు. మరో రకంగా చెప్పాలంటే, ‘దళితులను దళిత మనుష్యులుగా’ గుర్తించడం వేరు, ‘దళితులు తమతో సమానత్వం కలిగిన మనుష్యులుగా’ గుర్తించడం వేరు. ‘దళితులు తమలాంటి మనుష్యులే’ అని హిందువులు గుర్తించినట్లయితే వారిని దేవాలయంలోకి అహ్వానించి ఉండేవారు. కాని, అలా గుర్తించక ‘కేవలం దళిత మనుష్యులు ‘ అని మాత్రమే గుర్తించడం వలననే విగ్రహాన్ని దళితుల దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్ళడమంటే గూడెంలో ఉన్నవారిని గూడెంలోనే ఉండమని లేదా, దళితులను దళితులుగానే ఉండమని!
ఇంకొంత వివరణగా చెప్పాలంటే, చీకటి ఉంటేనే పగటి విలువ తెలుస్తుంది. వేసవి వేడిమి చురుకు తగిలితేనే పండు వెన్నెల హాయి తెలుస్తుంది. చీకటిలో, శిధిలావస్థలలో మగ్గి మృగ్యమైపోతూ, రోదిస్తున్న దళితులు తమకళ్ళెదురుగా ఉంటేనే హిందువులకు తమ జీవితాలలో వెల్లి విరుస్తున్న ఆనందమయాలు, యితరుపై తమ ఏలుబడి - నియంత్రణాధిపత్యాలు తెలిసేది. వీరు విలాసం పొందాలంటే వారిని విలాపానికి గురి చెయ్యాలి. అందుకోసం వారిని గుడులలోకి రానివ్వరు, గూడేలనుండి బయటకి పోనివ్వరు. ఇలా గూడేలలో, పేటలలో, పాళేలలో - ఎవరి ‘స్థానంలో ‘ వారిని ఉంచడమే హిందు మత ఆధిపత్యానికి, గర్వానికి కారణాలు. గర్వం కృత్రిమమే కావచ్చు. కాని, అది కృత్రిమమా (నెగెటివ్) లేక, వాస్తవమా (పాజిటివ్) అనే విషయాలతో దానికి నిమిత్తం లేదు. కృపాకర్ చెప్పుకుంటున్న గూడెం, యితర మాదిగలు పొగుడుకుంటున్న చెప్పులూ డప్పులూ గూడేన్ని, వర్తమానంతో సంబంధంలేని దాని సంస్కృతిని మాదిగల హృదయాలలో పటిష్టపరుస్తాయి. అలా పటిష్టపరచడమంటే కులాన్ని మరింత పటిష్టపరచడం, తద్వారా దళితులను మానుషత్వానికి దూరం చేసిన హిందు మతాన్ని మరింత పెంపొందించడం. కులాన్ని పటిష్టపరచుకోవడం ఆధిపత్యానికి ఆరాటపడే హిందూ మతానికి అవసరం. కులబాధితులు, సమసమాజ కాంక్షితులైన మాదిగలకు కాదు.
ముగింపు:
గ్రామాలు కులవ్యవస్థ కంచు కోటలు. దళితులు గ్రామాలలో ఉన్నంత కాలం కులం వారిని వెంటాడి వారి భౌతికాభివృద్ధితోపాటు మానసిక వికాసానికి కూడా అడ్డుకట్టలు పరుస్తుంది. కాబట్టి ‘గ్రామాలు వదిలి పట్టణాలకు తరలండి’ అని అంబేద్కర్ ఏనాడో పిలుపునిచ్చాడు. ఈ పిలుపు రెండు కారణాల వలన యివ్వడం జరిగింది. ఒకటి, ఆర్థికశాస్త్ర వేత్త అయిన అంబేద్కర్ రాబోయే కాలంలో పట్టణాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు అని అనాడే గ్రహించి ఆ రాబోయే అభివృద్ధిలో దళితులను భాగస్వామ్యులుగా చేసేందుకు. రెండు, గ్రామాలలో కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న కుల వృత్తుల శృంఖలాలనుండి దళితులను విముక్తి గావించి ఆధునిక వృత్తులలో వారిని రాణింపజేసేందుకు. ఆ వృత్తులలో దళితులు రాణించాలంటే అందుకవసరమైన విద్యను, నైపుణ్యతను వారు పెంపొదింపజేసుకోవాలి. అలా పెంపొదింపజేసుకొనిననాడు తర తరాలుగా హిందు కుల వ్యవస్థ తమపై రుద్ధిన ఆత్మ న్యూనతా భావాన్ని అధిగమించి ఆ వృత్తులలో దళిత యువత సగర్వంగా ప్రవేశించడానికి అవకాశం ఉంది. నాడైన, నేడైన మాదిగలు, యితర దళితులు చెయ్యవలసిన పని గూడేలనుండి, పేటలనుండి బయట పడటం. ఆధునిక వృత్తులలోకి ప్రవేశించి కులాన్ని దుర్భలను చేసి, క్రమంగా ఆ వ్యవస్థను నిర్మూలించడం. యిలా చెయ్యడం మాదిగలతో పాటు కుల బాధితులు, సమ సమాజాన్ని కాంక్షించే వారందరి భుజ స్కంధాలపైనున్న చారిత్రక సమిష్టి బాధ్యత. అయితే, అరుదుగా తమ వర్తమాన జీవితాలతో సంబంధమున్న చెప్పు, డప్పు, గూడెం విషయాల రొమాంటిసైజేషన్ మాదిగలను ఈ చారిత్రక బాధ్యతనుండి ప్రక్కదారి పట్టించి ఒక కృత్రిమ స్పృహలోనికి జోకొట్టడమేగాక, హిందువుల హోమగుండంలో వారు ఆజ్యంగా మారెందుకు ఆయత్తం చేస్తుంది. నడుస్తున్న మార్కెట్ వ్యవస్థలో వస్తువులైనా, సంస్కృతులైనా ఎవరికీ చెందవు. కేవలం వినియోగించుకునే వారికే చెందుతాయి. అంటే, తొడిగేవాడిదే చెప్పు, కొట్టేవాడిదే డప్పు. ఏనాడో పరాధినంపాలై, వర్తమానంలో ఏ విధంగానూ ఆర్ధిక ప్రయోజనకారి కాని నాటి మాదిగ కుల వృత్తులను విడనాడి ఆధునిక వృత్తులలో నైపుణ్యత సాధించి మార్కెట్లో ప్రవేశించే మార్గాలను వెదకాలి. అందుకిప్పుడు మాదిగలు (వీరితో పాటు యితర దళితులు) వేసుకోవలసిన ప్రశ్నలు: మారిన ఆర్ధిక రంగ అవసరాల రీత్యా నేర్వవలసిన సామర్ధ్యం ఏమిటి? ఆ సామర్ధ్యాన్ని సాధించేది ఎలా? ఆ సామర్ధ్యం ఆధారంగా గ్లోబలైజెడ్ వృత్తులలో స్థానాలు సంపాదించేదెలా? ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు, గ్లోబల్ వృత్తులలోకి ప్రవేశానికావసరమైన నైపుణ్యతను సాధించేందుకు చెయ్యవలసిన మొట్ట మొదటి పని: గూడెం నుండి బయటపడడం.
—- సాంబయ్య గుండిమెడ
గౌరవనీయులైన సాంబయ్య గుండిమెడ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
మీరు వ్రాసిన వ్యాసం చదివిన తరువాత నిజంగా నేనెంతో ఆనందించాను. మీరు మన మాదిగ పరిస్థితిని ఎంతో ఆకళింపు చేసుకొని చాలా సమగ్రంగా, పకడ్బందిగా సమర్ధవంతంగా మీ వాణిని మీ బాణిలో ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతూ చక్కగా పరిష్కార మార్గాలను సూచించారు.
నా అభిప్రాయ ప్రకారం ముందు మన మాదిగలకు మొదటగా కావలిసింది మీరు చెప్పినట్లుగా ఎదగాలనే “ఆకాంక్ష”. ఈ ఆకాంక్ష, ఆరాటం గా మారాలి. ఈ ఆరాటం, పోరాటంగా మారాలి. రెండవదిగా, పట్టుదలతో కూడిన “చదువు”. చదువే గౌరవం. కనుక విజ్నానానికి , గౌరవానికి మరియు ఎదుగుదలకు ఆయుపట్టైన విద్యను అభ్యసించేలాగా చేతనంతైన వరకు మనందరం కృషి సల్పాలి.
మూడవదిగా, కలిసికట్టుగా (ఆర్గనైజింగ్)ఉండటం నేర్వాలి నేర్పాలి.
మీరు ఉన్నతంగా ఇంకా ఎదగాల్ని ఆకాంక్షిస్తూ ,
ఇట్లు,
మీ సోదరుడు,
రాచేటి జయానంద్.
ఈ వ్యాసం నాకు చాలా నచ్చింది.తుల్లిమల్లి సుధాకర్