యతి రాజులు గారు అవిశ్రాంత శ్రామికుడు. ప్రజల మనిషి. 50 సంవత్సరాలుగా ప్రజల సాహిత్యాన్ని అనువదిస్తూ పైసా ఆశించని సాంస్కృతిక కార్మికుడు. పిల్లలన్నా, మరీ ముఖ్యంగా పల్లెలన్నా, పల్లెల్లో పిల్లలన్నా ఎంతో ఇష్టం, విశ్రాంత ఉపాధ్యాయుడైనా పిల్లల ప్రేమకు పాత్రుడయిన ఉత్తమ ఉపాధ్యాయుడు నిరాండంబరుడుతో ఇంటర్వూ ఈ మాసం ప్రజాకళ పాఠకులకోసం.- రత్నాల విజయలక్ష్మి
మీ కుటుంబ నేపధ్యం ఏమిటి?
నేను 1935 ఆగస్టు 4 న తమిళనాడు లోని గుడియాత్తం పట్టణంలో ఒక పేద చేనేత కార్మికుని ఇంట్లో పుట్టాను . నాకు ముగ్గురు చెల్లెళ్ళు , ఇద్దరు తమ్ముళ్ళు. అంత పేదరికంలోనూ సంతృప్తి నిచ్చిన అంశం కుటుంబ అప్యాయతా అభిమానాలే.
మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది?
మేము తెలుగువాళ్ళమి. హైస్కూలు వరకూ గుడియాత్తంలోనె తెలుగు మీడియం స్కూల్లో చదివాను. స్వాతంత్రానంతరం హిందీ భాష అభివృద్ధి చేయడానికి ప్రతి పల్లెలోనూ హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో ఉచితంగా హిందీ నేర్పించారు. దాంట్లో డిగ్రీ వరకూ చదివి , ఆగ్రాలో హిందీ టీచరు ట్రైనింగ్ చేసాను.
మీరు ఎప్పటి నుంచి కమ్యూనిస్టు కార్యకర్తగా వున్నారు?కమ్యూనిస్టు కార్యకర్తగా వుండటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
నాకు బుద్ధి తెలిసేప్పటికే కమ్యూనిస్టు కార్యకర్తగా వున్నాను. నా జీవితంలో జరిగిన మూడు సంఘటనలు రెండో ప్రపంచయుద్ధ కాలంలో, యుద్ధం వలన కలిగే వినాశనం, బీభత్సాన్ని ప్రత్యక్ష్యంగా చూశాను యుద్ధాలు ఎందుకొస్తాయో మా ఉపాధ్యాయుల సహయంతో క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆ వయసులోనే పెట్టుబడి దారీ విధానం ముదిరి సామ్రాజ్యవాదంగా మారడాన్ని , వాళ్ళు దోచుకోవడానికి వలస రాజ్యంగా ఏర్పరుచుకోవడం మొదలయిన విషయాలు తెలుసుకున్నాను.
1946 ప్రాంతంలో మతకలహాలు విపరీతంగా జరిగేవి. మా గుడియాత్తంలోనూ మెజారిటీ మతస్తులు, మైనారిటీ మతస్తులైన ముస్లింలపై దాడి చేసేవారు. ఒక ముస్లిం యువకుడుని హిందూ మతోన్మాదులు మా ఇంటి గడప పైనే ముక్కలు ముక్కలుగా నరికి చంపడాన్ని నా కళ్లారా చూసి చలించిపోయాను.1948 జనవరి 30 న గాంధీజీ హత్య. “ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో గాంధీజీ మరణించాడని రాస్తారు. కానీ గాంధీజీ హత్య గావించ బడ్డాడని రాయకపొవడం, అదీ హిందూ మతోన్మాదుల చేతుల్లో హత్య చేయబడ్డాడని తెలపకపోవడం అత్యంత దారుణమైన విషయం. నాధూరామ్ గాడ్సే అనే అతను తన చేతి మీద అబ్దుల్లా అని పచ్చబొట్టు పొడుచుకొచ్చి గాంధినీ చంపి ముస్లింలు చంపారని వక్రీకరించడానికి ప్రయత్నించారు.
మా వూర్లో మేము గాంధీ హత్యకు నిరసనగా మౌన ప్రదర్శన చేస్తున్నాం, అప్పుడు RSS ఆఫీసులో గాంధీని హత్య చేసేశాం అనే సంతోషంలో లడ్డూలు పంచుతూ వున్నారు. అది చూసి ఆగ్రహించిన ప్రజలు ఆ బిల్డింగ్ ను అప్పటి కప్పుడు కూల్చేసారు. అప్పుడు ప్రజల శక్తి తెలిసింది. నా చిన్న వయస్సులో జరిగిన ఈ మూడు సంఘటనలు నన్ను కమ్యూనిస్టు కార్యకర్తగా మర్చేసాయి. నా 14 సంII వయస్సుకే నన్ను సంఘర్షణకు గురిచేసిన మూడు అంశాలకు పరిష్కారానికి నిర్దిష్ట రూపం కమ్యూనిస్టు పార్టీ అనే అవగాహన కలిగింది.
మీరు అనువాద కార్యకర్తగా మారడానికి కారణాలేవి ?
చిన్నప్పటినుంచి పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని . మావూర్లో కమ్యూనిస్టు కార్యకర్తలు వుండేవారు. వాళ్ళకి వచ్చే ప్రతి పత్రికా క్షుణ్ణంగా చదివేవాడ్ని. 1949 లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించినా, పార్టీ సభ్యులు , సానుభూతిపరులు వేరే పేర్లలో పత్రికలు నడిపేవారు. ఆ పత్రికలన్నీ క్రమం తప్పకుండా చదివే వాడిని.
1956 సంIIఆగ్రాలో హిందీటీచరు ట్రైనింగ్ చేసేప్పుడు సమగ్ర భారత దేశాన్ని చూసాను.దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన 250 మంది విద్యార్థులు వుండే వాళ్ళు. మాలో మాకు జరిగే సాహిత్య చర్చల్లో ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. అప్పటి వరకూ తెలియని కొత్త ప్రపంచం తెలిసేది. అప్పుడే మొట్టమొదటి సారిగా విజయవాడకు చెందిన లక్ష్మణ మూర్తి అనే విద్యార్థి శ్రీశ్రీ ని పరిచయం చేసాడు.నాకు తెలిసిన నాకు పరిచయమైన ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేయాలనే సంకల్పం అప్పటి నుంచే మొదలయ్యింది. 1956 నుంచే అనువాద ప్రక్రియను మొదలు పెట్టాను. అప్పటినుంచి నేటికి అదే ప్రక్రియ కొనసాగిస్తున్నా.
అనువాద ప్రక్రియ ఎలా వుంటుంది?
అనువాదాలు రెండు రకాలు. పబ్లిషర్ల కోరిక మేరకు అనువదించడం ఒక రకం. ఇది చాలా వరకు కమర్షియల్ రచనలు. రెండో రకం అనువాదకుడి భావజాలానికి సంబంధించినది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమాజ శ్రేయస్సు కాంక్షించే రచనలను అనువదించడం. ఇలాంటి రచనలకు స్థల, కాలంతో పరిమితులుండవు దీర్ఘ కాలిక ప్రయోజనాలుంటాయి. ఇలాంటి రచనలు చరిత్రలో నిలిచిపోతాయి. ఒక్కోసారి చరిత్రను సృష్టిస్తాయి.
మీరు అనువాదానికి ఎంచుకునే పుస్తకాలు ఎటువంటి ప్రమాణాలు వుండేటట్లు చూసుకుంటారు?
ప్రజల సాహిత్యాన్ని , ప్రజలకు ఉపయోగపడే సాహిత్యాన్ని అనువదించాలనుకుంటాను. నాకు చరిత్రను చదవడం అంటే చాలా ఇష్టం. మార్క్సిస్టుని కాబట్టి చరిత్రను మార్క్సిస్టు దృక్పథంలో అన్వయించకుంటూ చదువుతాను. నేను మొట్టమొదటిగా చదివిన అనువాద రచన రాహుల్ సాంకృత్యాయన్ ది, ఓల్గా నుంచి గంగకు తమిళంలో చదివాను.నన్ను రాహుల్ సాంకృత్యన్ విపరీతంగా ఆకర్షించాడు. అతని రచనలన్నీ చదివేసాను.
ట్రైనింగ్ పూర్తవగానే 1958 లో చిత్తూరు వుద్యోగం వచ్చింది. అప్పుడు’ న్యూ సెంచరీ బుక్ హౌస్ ‘ కమ్యూనిస్టుల బుక్ షాపు, మద్రాసులో వుండేది. దాంట్లో మా బంధువు పనిచేస్తూవుంటే వాడు. అతని కోరిక మేరకు నా అభిలాష తోడయ్యి రాహుల్ సాంకృత్యాయన్ రచనలన్నిటినీ ( ఓల్గా నుంచి గంగకు, మార్క్సిజం ఆంటే ఏమిటి అనే రెండు పుస్తకాలు తప్ప ) అనువదించాను.అప్పటికి కమ్యూనిస్టు పార్టీ విడిపోలేదు.
మీరు కమ్యూనిస్టు పార్టీ విడిపోయినప్పుడు CPM వైపు రావడానికి కారణాలేమిటి ?
మా బంధువులు అందరూ CPI వైపే నిలిచిపోయారు. 1962లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరయితే నిజమైన కమ్యూనిస్టులుగా భావించారో వాళ్ళందరినీ అరెస్టు చేసారు. వాళ్ళందరూ బయటకు వచ్చి 1964లో CPI(M) గా ఏర్పడ్డారు. ఆ రెండు సంవత్వర కాలంలో న్యూ సెంచరీ బుక్ హౌస్ ( తమిళనాడు) విశాలాంధ్ర( ఆంధ్ర ప్రదేశ్ ) పుస్తకాల షాపులను CPI వాళ్ళు ఆక్రమించుకున్నారు. తరువాత CPM ఆధ్వర్యంలో తమిళనాడులో భారతి బుక్ హౌస్ , ఆంధ్రలో ప్రజాశక్తి ఏర్పడ్డాయి. CPM గా ఏర్పడ్డనాయకులే నిజమైన కమ్యూనిస్టులు, CPM కార్యకర్తగా కొనసాగుతున్నాను. 1970 నుంచి భారతి బుక్ హౌస్ తరుపున అనువాదాలు చేస్తున్నాను.
మీరు అనువదించిన నవలల్లో మిమ్మల్ని కదిలించిన నవల ఏది? . అత్యంత ప్రజాదరణ పొందిన నవల ఏది?
సి.కె .నారాయణ రెడ్డి , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రారంభకుడు , చిత్తూరు జిల్లా రొంపిచర్ల వాసి , పీలేరు M.L.Aగా కూడా వున్నారు. అతను నాకు మిత్రుడు .హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రారంభించినప్పటినుంచి, పీలేరుకు వచ్చినప్పుడల్లా పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ క్రమంలోనే సహవాసి అనువదించిన ఏడు తరాలు, స్పార్టకస్ నవలలు చదివాను. ఇవి నన్ను బాగా కదిలించాయి. ఇవి తమిళ ప్రజలకి అందించాలని భారతి బుక్ హౌస్ తరుపున తమిళంలో అనువదించాను. ఈ పుస్తకాలు తమిళనాడులో నన్ను మంచి అనువాదకుడిగా నిలిపాయి. ఇవి అత్యంత ప్రజాదరణకు నోచుకున్నాయి.
మీ మొట్టమొదటి అనువాద రచన ఏది?
దేశదిమ్మరి పురాణం రాహుల్ సాంకృత్యాయన్ ది . తమిళనాడు లో ఈ పుస్తకానికి రాజకీయ ప్రాముఖ్యత సంతరించికుంది . తమిళనాడులో ద్రవిడ రాజ్యం కావాలని వుద్యమం తీవ్రంగా నడిచేటప్పుడు కమ్యునిస్టులు , కాంగ్రేస్ వాళ్లు దాన్ని వ్యతిరేకించడానికి ఈ పుస్తకాన్ని వాడుకున్నారు. విడిపొవడం అనేది కూపస్తమండూక చర్యయని భావిస్తూ వాళ్ళ ప్రచారానికి, ప్రసంగాలకి విస్తృతంగా ఈ పుస్తకం ఉపయోగపడింది.
మీరు కళ్యాణరావు రాసిన అంటరాని వసంతాన్ని తమిళంలో అనువదించారు కదా ! అది దళితుల జీవితాన్ని చిత్రీకరించిన పుస్తకం మాత్రమే కాదు , ఒక రాజకీయ మార్గాన్ని నిర్దేశించిన పుస్తకం. ఆ రాజకీయ మార్గంతో మీరు ఏకీభవిస్తారా?
కళ్యాణరావుగారి అంటరాని వసంతం దళిత సాహిత్యంలోనే ఒక ప్రత్యేకమైన నవలగా నాకనిపించింది. దాంట్లొ మానవ సంబంధాలు నన్ను కదిలించాయి.150 సంII దళితుల చరిత్ర , వాళ్ళ సంస్కృతిక జీవితాల చిత్రీకరణ నన్ను కదిలించాయి. బంకింగ్ హామ్ కాలువ చరిత్ర ఈ పుస్తకం చదవక ముందే నేను అధ్యయనం చేసాను. ఆ చరిత్రను యధాతధంగా రాయడం, దళితుల్లో వుండే క్రిష్టియన్ టచ్ ని వివరించడం బాగా నచ్చింది.ఇక ముగింపు అనేది …. కళ్యాణరావు విరసం నాయకుడు. అయన రచించిన చరిత్ర,, అదీ కూడా చరిత్రలో భాగమే కదా! దాన్ని నాఅభీష్టానికి తగినట్టు మార్పు చేయడం సరైంది కాదు , ఆమోదయోగ్యమూకాదు.
తమిళ ప్రజల్లొ ‘అంటరాని వసంతానికి ‘ ఎటువంటి స్పందన లభించింది?
తమిళ ప్రజలు అంటరాని వసంతాన్ని అక్కున చేర్చుకున్నారు. దళితులు , క్రిష్టియన్లు , కమ్యూనిస్టులు పుస్తకాన్ని బాగా చదివారు. శ్ర్ర్రీ లంకలో తమిళులు కూడా పుస్తకాన్ని ఆదరించారు. శ్రీలంక నుంచి ఇద్దరు రచయితలు నన్ను ప్రత్యక్షంగా కలిసి అభినందించారు. ఇప్పుడు అది 8 వ ముద్రణ లో వుంది.
మీరు తెలుగులో మొట్టమొదటగా అనువదించిన పుస్తకం ఏది ? ఇతర ప్రముఖ పుస్తకాలేవి?
నేను మొట్టమొదటగా రహుల్ సాంకృత్యాయన్ పుస్తకం ‘ఈ దుష్ట సమాజం పతనంకాక తప్పదు’ అనువదించాను. ఇంకా ఇతర ప్రముఖ అనువాదాలంటే …. శివశర్మ, సంస్మృతులు, చిన్నప్ప భారతివి …..సంఘం , దాహం, శబ్ధరశ్మి నాటకాలు…….మనిషికథ, సుందరయ్య విప్లవపధంలో నా పయనం రెండుభాగాలు, గిజుభాయి సమగ్ర సాహిత్యం 7 సంపుటాలు ముఖ్యమైనవి.
మీకు నచ్చిన అనువాదకుడు ఎవరు?
సహవాసి .అతను చేసిన అనువాదాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి .
మీకు నచ్చిన రచయిత ఎవరు?
‘గోర్కీ ‘. అతని రచనలు నన్ను బాగా ప్రభావితం చేసాయి. అతని జీవితం వైవిధ్య భరితం , అందుకే అతని రచనలు ఎన్ని సార్లు చదివినా తాజాగా వుంటాయి. రాహుల్ సాంకృత్యాయన్ బుద్ధి వికసించడానికి తోడ్పడితే, ప్రేమ్ చంద్ మానసిక వికాసానికి తోడ్పడ్డాడు.
మీరు ఉపాధ్యాయులు కాబట్టి గిజుబాయి సాహిత్యాన్ని అనువదించారా?
గిజుబాయి ఉపాధ్యాయిడు కాదు . న్యాయవాది . పిల్లల మీద మమకారంతో , చదువుల పేరుతో పిల్లల్ని పెట్టేహింసను చూడలేక, ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. నిజానికి నేను రిటైర్ అయిన తర్వాత ప్రజాశక్తి బుక్ హౌస్ కొరిన మీదట గిజూబాయి రచనల్ని అనువదించాను. కానీ బాగా నచ్చితేనే నేను దేన్నయినా అనువదిస్తాను. ఉపాధ్యాయిడిగా గిజుబాయి చదవక ముందే నేను ప్రయోగించి మంచి ఫలితాన్ని పొందాను.
ఒక మంచి అనువాదకుడికి వుండాల్సిన లక్షణాలు ఏమిటి ?
ఒక అనువాదకుడికి భాష మీద పట్టు వుండటం సరిపోదు. ఆ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు, సాంప్రదాయాలు. ఆచార వ్యవహారాలు తెలిసివుండాలి. ఒక రాజకీయ లక్ష్యం వుండాలి. ప్రజల పట్ల ప్రేమ, బాధ్యత , జవాబుదారీతనం వుండాలి. అప్పుడే మంచి అనువాదకుడిగా రాణించగలుగుతారు.
మీరు దాదాపుగా 50 సంవత్సరాలుగా అనువాదకుడిగా వున్నారు . ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించిందా ? మేకేమైనా అవార్డులు వచ్చాయా?
ప్రభుత్వం గుర్తుంచడమంటే NBT సంస్థ కేశవరెడ్ది రాసిన “అతడు అడవిని జయించాడు” నవలని నాచేత తమిళంలో అనువదింపజేశారు. దానికి మంచి పేరు వచ్చింది.
దక్షిణ భారత భాషా సంస్థ - మైసూర్ వారి తరుపున ‘మిరాన్’ అనే రచయిత రచించిన నవలని ‘ ఒక సముద్ర తీర గ్రామంలో ‘ పేరిట అనువదింపజేసారు. నేను ప్రభుత్వానికి చేసిన పనులు ఈ రెండు నవలలూ అనువదించి ఇవ్వడం మాత్రమే .
నన్ను తమిళనాడు ప్రభుత్వం యమ్.జీ.రామచంద్రన్ ముఖ్య మంత్రిగా వున్నప్పుడు సన్మానించారు. మల్లి వాణిజ్య సంస్థ ప్రతియేటా వుత్తమ అనువాదకుడికి ఇచ్చే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డునిచ్చి నన్మానించారు.
యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ద్రౌపది నవలపై మీ అభిప్రాయం ఏమిటి?
నేను ద్రౌపది నవల చదవలేదు. కానీ మేడి పల్లి రవికుమార్ రాసిన రివ్యూ చదివాను. ఏదయినా పురాణంలోని పాత్రలు మార్క్సిస్టులు తిరిగి రాయల్సిన అవసరం వుంది. రాముడు శంభూకుడ్ని ఎందుకు చంపాడో ప్రజలకి చెప్పాలి. కానీ ఒక స్త్రీ లైంగికత ప్రధాన అంశంగా వ్యాపార దృక్పధంతో రాయడం సరైంది కాదనిపించింది.
ప్రస్తుతం మీరు అనువదిస్తున్న పుస్తకం గురించి వివరిస్తారా?
మార్చి 8 మహిళాదినాన్ని గుర్తుచేసుకుంటూ మహిళా శాస్త్రవేత్తల చరిత్రను జనవిఙ్ఞాన వేదిక ప్రచురణల క్రింద తమిళం నుంచి తెలుగు లోకి అనువదిస్తున్నాను.
వ్యక్తిగత ప్రశ్న మీ కుటుంబం గురించి?
నా పెళ్ళి ఆ కాలంలొ చాలా ఆలస్యంగా జరిగినట్లే .1966లో జరిగింది. నాకు 30 సంవత్సరాలు దాటిన తరువాత. కొడుకు , కూతురు … మనుమలు, మనువరాళ్ళు వున్నారు. అందరూ ఆర్థికంగా స్థిరపడ్డారు.
యతిరాజులు గారిని ఈ విదముగా గా పరిచయమ చెసిన..ప్రజాకళకు
ధన్యవాదాలు
వారి గురించి తమిళ అనువాదకురాలు కా. అమరంత చాలా చెఫ్ఫారు
వారి ని తెలుగు పాటకులకు నెను పరిచయమ చెసాను
వారి లా నిభద్దత ఉన్న వాల్లు అరుదు…
యతిరాజులు గారి అనువాదాల గురించి ఇంతకు ముందు కూడా చదివాను కానీ, ఆయన జీవితనేపథ్యం, సామాజిక దృక్ఫధం వంటి విషయాలను ఇంత వివరంగా తెలుసుకోవడం ఇదే తొలిసారి. గత 50 సంవత్సరాలుగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అనువాదాలు చే్స్తూవస్తున్న విశిష్ట అనుభవశాలి. అందులోనూ నిబద్ధతతో కూడిన అనువాదాలు చేయటం చిన్నవిషయం కాదు. “ప్రజల పట్ల ప్రేమ, బాధ్యత , జవాబుదారీతనం వుండాలి. అప్పుడే మంచి అనువాదకుడిగా రాణించగలుగుతారు.” అనే ఈ అపర అనువాదకుడి వ్యాఖ్యలు ఏ అనువాదకుడికైనా శిరోధార్యం.
చక్కటి ఇంటర్వ్యూ ప్రచురించిన మీకు అభినందనలు.
రాజు
ఇంటర్వ్యూ బాగుంది.