ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగి అయిదు దశాబ్దాలు దొర్లి పోయాయి. ఒకే భాష అనే సాకుతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజల మధ్య తేడాతో దినదినం అనుమానాలు పెరిగిపోతూ వచ్చాయి.1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం , 1969 నాటి అఖిలపక్ష ఒప్పందం, అష్టసూత్ర, పంచసూత్ర పధకాలు 1973 నాటి ఆరుసూత్రల పధకం.
ఈ ఒప్పందం ఉల్లంఘనలు, ఆ ఉల్లంఘనలవలన ముందుకువచ్చిన ఉద్యమాలు, ఆందోళనలు, రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసిన అణచివేత చర్యలు, లేదా వీలైతే ఒక బుజ్జగింపు చర్య, రాజకీయ నాయకులు, పార్టీలు, నిర్వహించిన పాత్రలు, అన్నీ ఒక విషవలయంగా తయారై వివిధ ప్రాంతాల మధ్య విశ్వాస రాహిత్యాన్ని, విద్వేషాన్ని పెంచాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం పదే పదే పునరావృత్తమవుతూ వున్నది.
ప్రత్యేక రాష్ట్ర నినాదం అనేది కేవలం రాజకీయ నినాదం కాదు. దీనికి ఆర్థిక , సామాజిక ,సాంస్కృతిక అంశాలతో ముడివడిన అనేక బలమైన కారణాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఈనాటిది కాదు.ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందునుండే ఇక్కడి ప్రజలు విశాలాంధ్ర ఏర్పాటు పట్ల వ్యతిరేకతను చాలా స్పష్టంగా తెలియజేశారు. అయినా నవంబర్ 1, 1956 న తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా , రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సంఘం (SRC) సిఫార్సులకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అంత కుముందు అక్టోబర్ 1, 1953 న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పటుకు కూడా సర్వజన ఆమోదం లేదు. రాయలసీమ వారు ఆ రాష్ట్ర ఏర్పాటును అంతకు ముందు నుండే చాలా సంవత్సరాల నుండి వ్యతిరేకించారు. అయినా వారి అభిప్రాయాలకు కూడా గౌరవంలేకుండా ఆ రోజు బలవంతంగా ఆంధ్రరాష్ట్రంలో రాయలసీమను విలీనం చేసుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పేరుతో మరోసారి తెలంగాణాను బలవంతంగా విలీనం చేసుకున్నారు .అందుకే ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారు “విశాలాంధ్ర వెనుక దురాక్రమణోద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం గర్భితమై ఉంది” అని అభివర్ణించారు. ( ఇండియన ఎక్స్ ప్రెస్ 17, అక్టోబర్ 1953) విలేకరుల సందేశం.
1948 లో జరిగిన పోలీస్ యాక్షన్ తరువాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. అప్పటినుండి 1952 ఎన్నికలు జరిగేవరకు హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన మిలటరీ లేక సివిల్ అడ్మినిష్ట్రేటర్స్ పాలనలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అనేకమంది ఆంధ్రులు ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రాంతానికి రావటం మొదలుపెట్టారు. ఆ విధంగా బ్రతుకు దెరువు కొరకు వలస వచ్చినవారు ఉద్యోగస్తులుగా ప్రవర్తించేబదులు ఈ ప్రాంతానికి వచ్చిన విజేతలుగా , తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన సంస్కర్తలుగా , ప్రవర్తించారు. అందుకే 1952 లో తెలంగాణ ప్రజలు నిరసన తెలుపుతూ ఆందోళనకు పూనుకున్నారు. దీనినే నాన్ ముల్కి ఉద్యమం అనే పేరుతో చరిత్రలో చెప్పుకుంటున్నాము. ఈ ఉద్యమంలో కూడా అనేకమంది పొలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినప్పటికి తెలుగు మాట్లాడే వారందరు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే నెపంతో రాష్ట్రం పునర్ వ్యవస్తీకరణ సంఘం (SRC) ను జస్టిస్ ఫజల్ అలి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమీషన్ రాష్ట్రంలో విశ్తృత అధ్యయనం చేసి తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా తెలియజేసింది.అందులో ముఖ్యమైనవి. తెలంగాణ ప్రాంతన్ని ఒక వలస ప్రాంతంగా మార్చి వేసే ప్రమాదముంటుందని చెప్పారు. ఇంకా ఆయన “తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలసి వుండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు తీసుకున్నట్లుగా కొంతకాలం తరువాత రెండు ప్రాంతాలు విడిపోవచ్చు” అని కూడా సూచించారు. ఒకప్రక్క కమీషన్ కు ఇష్టం లేక, ప్రధానికి ఇష్టం లేకపోయినప్పటికి, విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధానకారణం, వారిపై ఆంధ్ర నాయకులు తెచ్చిన ఒత్తిడి మాత్రమే. ఆనాటి తెలంగాణ ప్రాంతపు నాయకులు నిజాం రాష్ట్రంలో పుట్టి పెరగడం వలన కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో చనువు, సహచర్యం లేనందువలన వారి అభిప్రాయాలకు ప్రాధన్యత లభించలేదు. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో న్యాయం జరుగదనే భయం తొలగించడం కోసం ఒక ఒప్పందం చేసుకున్నారు. దానిని “పెద్ద మనుషుల ఒప్పందం” అంటారు ఈ ఒప్పందం వలన తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజలలో కలగలేదు. ఫజల్ అలీ కమీషన్ కూడా ప్రాంతీయ కమిటీల వల్ల తెలంగాణ ప్రాంతానికి న్యాయం సాధ్యం కాదని అభిప్రాయ పడింది. అందరూ ఊహించినట్లుగానే “పెద్ద మనుషుల ఒప్పందం “ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజే ఉల్లంఘించబడిండి. ఒప్పదం ప్రకారం ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం వారుండాలి కాని ఉప ముఖ్యమంత్రి “ఆరవ వేలి” వంటిదనే సాకుతో ఉప ముఖ్య మంత్రి ని నియమించలేదు.
తెలంగాణ ప్రాంతంలో ప్రాంతేతరులు భూములు కొనేముందు ప్రాంతీయకమిటి అనుమతి తీసుకోవాల్సి వుంది. కాని అటువంటి అనుమతి ఏదీ లేకుండానే లక్షలాది ఎకరాల భూమిని ఆంధ్ర నుండి వలస వచ్చిన వారు కొన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద అప్పటికే సాగులో వున్న భూములను. భవిష్యత్ లో నీటి పారుదల అవకాశం కలిగే భూములను తక్కువ ధరలకు కాని ( కొన్నిప్రాంతాలలో ఆక్రమించుకుని) స్థానికులను నిర్వాసితులను చేశారు. తెలంగాణ నిండా ఎక్కడపడితే అక్కడ గుంటూరు పల్లెలు , రాజ మండ్రి వాడలు వెలిశాయి.
తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు నిధులను తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కొరకే ఖర్చుపెట్టాలనే నిబంధన ఉన్నప్పటికీ ఆ నిధులను ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కొరకు పెద్ద ఎత్తున తరలించారు. దాని వలన తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది.
ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారందరు తెలంగాణ ప్రాంత ప్రజలను కించపరిచే విధంగా ప్రవర్తించారు. తెలంగాణ వారికి ఇంగ్లీష్ రాదని , వారు మాట్లాడేది తెలుగు కాదని , పరిపాలన విషయంలో వారు అసమర్ధులని పారిశ్రామిక వ్యవసాయరంగాలలో వారు సోమరిపోతులని, వారికట్టుబొట్టు ఆటవికమైనవని హేళన చేశేవారు . ఈ విధంగా నిరాటంకంగా కొనసాగిన అన్యాయాలు, అతికానుణలు, ఉల్లంఘనలు, ఈసడింపులు, వేధింపుల వలన విసిగి వేసారిన తెలంగాణ ప్రజలు 1968- 69 లో ఒక అపూర్వ ఉద్యమానికి నాంది పలికారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండానే ప్రజా ఉద్యమానికి విద్యార్థులు, ఉద్యోగులు , మేధావి వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇంజనీర్లు , డాక్టర్లు జీవం పోశారు. 1968లో ప్రారంభమైన ఈ ఉద్యమం 1969 నాటికి తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆనాటి ప్రభుత్వం హడావిడిగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.19 జనవరి 1969 న ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 45 మంది రాజకీయ నాయకులు పాల్గోని అంగీకారానికి వచ్చారు.దీనినే అఖిలపక్ష ఒప్పందం ” (ఆల్ పార్టీ కాంకర్డ్) అంటారు.ఈ ఒప్పందంలో చేసుకున్న నిబంధనలను కూడా ఆ తరువాత క్రమంలో ఆంధ్ర ప్రాంతం వారు వ్యతిరేకించారు. ఉల్లంఘించారు. దానితో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తమకు న్యాయం జరగదనే అభిప్రాయం తెలంగాణ ప్రజానికంలో ఇంకా తీవ్రస్థాయిలో ప్రభలిపోయింది. దాంతో 1969 లో మళ్ళీ ఉద్యమం తీవ్రస్థాయిలో నడిచి దాదాపుగా 370 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరుణంలో అప్పటి ప్రధన మంత్రి ఇందిరాగాంధీ 11 ఏప్రిల్ 1969 న పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక పధకాన్ని ప్రారంభించింది. దానినే “అష్ట సూత్ర పథకం ” అంటారు. అదే విధంగా ఈ పథకాల పరంపరలో ఐదు సూత్రాల పధకం ఆ తరువాత 3 అక్టోబర్ 1972లో సుప్రీం కోర్టు ముల్కి నిబంధనలు రాజ్యంగ బద్ధమైనవేనని తీర్పునిచ్చింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆంధ్ర ప్రాంతీయులు “జై ఆంధ్ర” ఉద్యమం చేపట్టారు. నిజానికి ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం అప్పటి వరకు వివిధ పధకాల పేరుతో తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలను తొలగించడమే. ఫలితంగా 21 సెప్టెంబర్ 1973 లో మరో పథకాన్ని అమలు చేసే క్రమంలో తీసుకున్న నిర్ణయాలే తెలంగాణ ప్రాంతానికి గొడ్డలి పెట్టు అయింది. అందుకే గత 54 సంవత్సరాల కాలంలో చవిసూసిన చేదు అనుభవాల నేపధ్యంలో తెలంగాణ ప్రజలకు జరిగిన, ఇంకా జరుగుతూవున్న ఇక ముందుకూడా జరగనున్న అన్యాయాల నుండి విముక్తం కావడం కొరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారంగా ఉద్యమిస్తున్నారు.
నదీ జలాల పంపిణిలో తెలంగాణకు జరిగిన అన్యాయం
తెలంగాణ వెనకబాటు తనానికి ముఖ్యమైన కారణం ఇక్కడ వనరులను ప్రాంతీయ అభివృద్ధి కొరకు తరలించడం. అది నదీ జలాల విషయంలో మరీ దారుణంగా జరిగింది. కృష్ణా , గోదావరి నదులలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన తెలంగాణ భారత దేశంలోనే అత్యంత సస్యశ్యామలంగా వుండాల్సిన ప్రదేశం.కాని రాష్ట్ర పాలకుల వివక్ష వల్ల, సాగునీటి సంగతి కాదుగాని తాగునీటికి కూడ నోచుకోని పరిస్థితి. ఎడారిగా మారిపోయే దశకు చేరుకుంది తెలంగాణను విశాలాంధ్రలో విలీనం చేస్తే ఇలాగే జరుగుతుండని SRC ఆనాడేనొక్కిచెప్పింది.
కృష్ణానదికి ఉన్న పరివాహక ప్రాంతంలో 68.50 శాతం తెలంగాణలో, 18.39% రాయలసీమలో, 13.11 శాతం కోస్తా ప్రాంతంలో ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో సాగుకు యోగ్యంగా వున్న భూమికూడ 65% తెలంగాణ లోనే వుంది. ఏ దృష్టి తో చూసిన కృష్ణా నీటిలో అధిక భాగం తెలంగాణకు చెందాలి కాని దానికి భిన్నంగా మొత్తం 594.84 TMC ల నీటిలో తెలంగాణ ప్రాంతం కేవలం 65TMC ల నీటిని మాత్రమే వాడుకోగలిగే పరిస్థితులేర్పడ్డాయి.నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టును కూడా మొదట నందికొండ స్థలాన్ని మార్చి క్రిందికి జరిపిదానికి నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. కాలువలు రెండింటికి సమానంగా అటు 132 TMCలు , ఇటు 132 TMCలు వాడు కోవాలి కాని తెలంగాణ ప్రాంతంలో పారే ఎడమకాలువ సామర్ధ్యాన్ని 90TMC లకే పరిమితం చేశారు. అయినా ఏ సంవత్సరము కూడా అది 65TMCలు వాడటం లేదు. ఇదే నదిపై జూరాల ప్రాజెక్టుకు 17.84TMC నీటిని కెటాయిస్తే జలాశయం సామార్థ్యాన్ని 11TMCలకే కుదించివేశారు.ఇందులోను ఇప్పటి వరకు వినియోగంలోకి వచ్చిందిమాత్రం 2TMC ల నీరు మాత్రమే. రాజోళి బండ మల్లింపు పధకం (RDS) ద్వారా తెలంగాణాకు 15.9 TMC ల నీరు రావలసి వుండగా రాయలసీమ ఫ్యాక్స్ నిస్టులు ( కర్నూలుకు చెందిన బైరెడ్డిరాజశేఖర్ రెడ్డి) జలాశయం గేట్ లను బాంబులతో పగులగొట్టి తెలంగాణా ప్రాంతానికి నీరు రాకుండా చేశాడు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కూడా 70% తెలంగాణాలో 30% ఆంధ్ర లో వుంది. ఆదేవిధంగా సేద్యానికి యోగ్యమైన భూమి కూడా 70% తెలంగాణాలోనే వుంది. తెలంగాణా ప్రాంతానికి ఎక్కువగా ఉపయోగపడడానికి అవకాశమున్న ఈ నదీ జలాల పంపిణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ముందు బాధ్యతారహితంగా ప్రవర్తించింది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర ఎంతనీరడిగితే అంతనీరివ్వడానికి ఒప్పుకుంది.దీనివల్ల శ్రీరాంసాగర్ కు, నిజాం సాగర్ కు కావలసిన నీరురాకుండా పోయింది. తెలంగాణాలో 20లక్షల ఎకరాలకు నీరందిచవలసిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టి 30సంII అయినా ఇంకా పూర్తిగా కాలేదు. కనీసం ఈ ప్రాజెక్టు 20 లక్షలకు కాకపోయిన 10లక్షల ఎకరాలకు నీరందించిన అదృష్టంగా భావించవలసి వస్తుంది. “ఒకసారి రక్తాన్ని చవిచూసిన పులి మళ్ళీమనిషి రక్తం కొరకే తారాడినట్లు ” కృష్ణా జలాలను చవిచూసిన వారిదృష్టి ఇప్పుడు గోదావరివైపుకు మళ్లింది.
అయితే ఈ దుస్థితికి కారకులెవరనే ప్రశ్నకు సమాధానంగా ఏ ఒక్క రాజకీయ పార్టీనో, ఏ కొందరు రాజకీయ నాయకులనో నిందించలేము ఏ పార్టీ అధికారానికి వచ్చిన, ఏపార్టీ అధికారానికి వచ్చినా, ఏ పార్టీలు ప్రతి పక్షంలో ఉన్నా ఏ పార్టీ పాలకవర్గాలకు మిత్రపక్షాలుగా వ్యవహరించిన ఏ ప్రాంతపు నాయకులు రాజ్యమేలినా ఒక్కటి జరిగింది. అది తెలంగాణ ప్రాంతానికి నిరాటంకంగా నిరంతరంగా జరిగిన అన్యాయం ” తిలాపాపం తలా పిడికేడు” అన్నట్లుగా దీనిలో అందరు సమాన భాగస్వాములే వాస్తవానికి దీనికంతటికి కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణనే.