|
|
ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, ఈమాట పత్రికా సంపాదకులు వేలూరి వేంకటేశ్వర రావు గారితో ప్రజాకళ సాహిత్య పత్రిక ఇంటర్వూ. |
మొదటి భాగం:
ఒకటి:
రెండు:
మూడు:
ప్రశ్న: మీ బాల్యం, నేపధ్యం, కుటుంబ జీవనయాత్ర గురించి చెబుతారా? వే.వేం: నేను ఏలూరులో B.Sc వరకు చదువుకున్నాను. ఆంధ్రా యూనివర్సిటికి వెళ్ళి న్యూక్లియర్ ఫిజిక్స్ లో M.Sc చేశాను. ఆరు ఏళ్ళు నార్త్ బెంగాల్,…. లలో అధ్యాపకుడిగా పనిచేసాను. ఆ తర్వాత విదేశాల్లోనే ఫిజిక్స్ లో పి.హెచ్ డీ చేసాను. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో రీసెర్చ్ స్కాలర్ గా చేరాను. అక్కడే 27 సంవత్సరాలు వున్నాను. నాకు ఇద్దరు పిల్లలు.
ప్రశ్న: విధ్యార్థి జీవితంలో మీరు విధ్యార్ధి ఉద్యమాలలో కానీ, ప్రజా ఉద్యమాలలో కానీ పాల్గొన్నారా? కాస్త వివరిస్తారా?
వే.వేం: ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లో పనిచేశాను. ప్రత్యేకంగా ప్రజా ఉద్యమాలలో పనిచేయలేదు.
ప్రశ్న: విధ్యార్ధి దశలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం కానీ, రచన గానీ, రచయిత గురించి చెప్పగలరా?
వే.వెం: శ్రీ.శ్రీ రచనలద్వారా ప్రభావితం కానివారు ఆనాడు విద్యార్ధుల్లో ఎవ్వరూ లేరనుకుంటా. అయితే కృష్ణశాస్త్రి గారు కూడా బాగా ప్రభావితం చేసాడు. విశ్వనాధ సత్యనారాయణ గారు కూడా కొంతవరకు ప్రభావితం చేసాడు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ని చాలా తేలికగా చదువుకోగలిగే వాళ్ళం. విశ్వనాధ సత్యనారాయణను చదువుకోవటం కొంచెం కష్టం. శ్రీశ్రీ రచనలకు చాలా ముగ్దులైపోయేవాళ్ళం. ఎందుకో తెలియదు. అప్పట్ల్లో లెఫ్టిస్ పుస్తకాలు చదివేవాళ్ళాం.
ప్రశ్న: అప్పట్లో యూనివర్సిటీ క్యాంపస్ లలో ఎక్కువగా చర్చించబడుతున్న రచనలు ఏమిటి? వే.వేం: అప్పట్లో లిబరల్ వ్యూస్ గలవాళ్ళు ఎక్కువగా వుండేవాళ్ళు. అలాంటి భావజాల పుస్తకాలు, రచనలు, ఎక్కువగా చర్చించించ బడుతుండేవి.
ప్రశ్న: స్మైల్ మీకు సమకాలికుడా? వే.వేం: స్మైల్ నాకు రెండేళ్ళు జూనియర్
ప్రశ్న: నక్సల్ బరీ ఉద్యమ ప్రభావం మీ మీద వుండేదా?
వే.వేం: ప్రభావం వుండేది. ఎంత వుండేది అనేది చెప్పలేను. అయినా ఇప్పుడది రిలవెంటు కాదనుకుంటా. చారుముజుందార్, కానూసన్యాల్ తెలుసు. చాలా దగ్గరగా చూశాను. చారుముజుందార్ ద్వారా బెంగాల్ యూనివర్సిటీలో ఉపన్యాసాలు ఇప్పించాము. అప్పుడు చాలా ఉత్సాహంగా వుండేది. ఇప్పుడు ఆ ఉత్సాహం, శక్తి రెండూ లేవు.
ప్రశ్న: అప్పటికీ, ఇప్పటికీ మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
వే.వేం: తప్పకుండా మార్పు వచ్చింది. రకరకాల రచనలు చదవటం వల్ల, స్వీయానుభవాలు చాలా ప్రభావితం చేసాయి.
ప్రశ్న: సుబ్బారావు ప్రాణిగ్రాహి గురించి మీ జీవిత అనుభవాలగురించి వివరిస్తారా? వే.వేం: ఆయన బాగా పాడేవారు. అతణ్ణి నేను బాగా అభిమానించేవాడిని. ఆయన పాడే చోట్లకు వెళ్ళేవాళం. అతను ఏలూరు వచ్చినప్పుడు కలిశాను. ఆయను చంపేసినప్పుడు బాధపడ్డాం.
ప్రశ్న: రచయితగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి?
వే.వేం: నేను ఇండియాలో వుండగ చాలా తక్కువ రాశాను. చెత్తపుస్తకాలు చాలా వచ్చేస్తున్నాయి. వాటిని తగలబెట్టాలని ఒక చిన్న స్కిట్ ఆంధ్రా యూనివర్సిటీ వుండగా వేశాము. అప్పట్లో ఒకటో, రెండో కథలు రాశాను. అయితే నన్ను నేను గా రచయిత అని అనుకోలేదు. ఒకటో రెండో వుస్తక సమీక్షలు కూడా వేశాం. నిజంగా రాద్దామని కోరిక పుట్టింది అమెరికా వచ్చాకే. ముఖ్యంగా విమర్శ అంటే నాకు ఇష్టం కాబట్టి, అక్కడా, ఇక్కడా విమర్శ రావటం లేదు కాబట్టి, డయాస్పోరా ఆడియన్స్ కోసం వ్రాశాను.
ప్రశ్న: డయాస్పోరా సాహిత్యానికి ఆడియన్స్ ఎవరు?
వే.వేం: కథ బాగుంటే ఎక్కడ వున్నా తెలుగు వాడైనా చదువుతాడు. 1916 అంటే మొదటి ప్రపంచ యుద్ధకాలం లో వచ్చిన అమెరికన్ కథలల్ని తీసుకోండీ. అవన్ని వలసవచ్చిన వారి మీద వచ్చాయి. మనము కూడా అంతే. మనకు కూడా ఇమ్మిగ్రెంట్స్ మీద కథలు వచ్చాయి. 1950 లలో వచ్చినవాళ్ళు ఎలా వున్నారు అని చదవాలంటే, తెలుగు వచ్చిన వాళ్ళే చదవాలి. తెలుగునుండి ఇంగ్లీషు కు అనువాదం చేస్తున్నది. ఒక్క వేల్చేరు నారయణరావు గారే. ఇవాళ్ళ తెలుగును అంతర్జాతీయ స్థాయికి నిలబెట్టింది ఆయనే. ఆయన అనువాదాల్ని మనం అమెరికను యూనివర్సిటీల్లో మనం చూడవచ్చు.
గమనిక: వేలూరి ఇంటర్వూ; మొదటి భాగాన్ని ఆడియో రూపంలో వినమని మనవి చేస్తున్నాం. అక్షరరూపంలో కొంత భాగాన్నే ఇస్తున్నాం.