నా చిన్న తనంలో మాకు ఒక నాయనమ్మ వుండేది. ఆమె పేరు వెర్రిబామ్మ. కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంతవరకు ఒకసారిగా, పాతికట్లకంటే, తక్కువ తిన్నవాడు లేడు. మాలో ఆమెని అందుకనే అట్ల బామ్మ అనే వాళ్ళం. ఎల్లా చేసేదో ఆ పిండి లో’ ఏం కలిపేదో ‘ ఎవరికీ తెలియదు. ఒకసారి నేను మా చెల్లెలు గారి ఊరు వెళ్ళుతున్నా.
మా చెలెల్లు గర్భిణీతో వుండి బామ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది. బామ్మ ఏం చేసిందంటే ,పిండి కలిపి , ఒక పెద్ద సత్తెప్పాలలో వేసి, సిబ్బి బోర్లించి, గుడ్డ వాసిన కట్టి, నన్ను ముందు తీసుకెళ్ళమంది. మర్నాడు తను బయలు దేరి వస్తానంది. చేబ్రోల్లో మధ్య ఒకరోజు దిగాను. మర్నాడు తెల్లవారి రైలుకొచ్చి,మూటా గిన్నె పెట్టుకుని, ప్లాటుఫారం మీదనుంచున్నా దగ్గిర వున్న వాళ్ళందరూ మూటలూ ట్రంకులూ మోసుకుని దూరంగా పోతున్నారు. కారణం తెలియక, ఎందుకన్నా మంచిది వాళ్ళు నాకేసి కోపంతో చూసి వెనక వొదిలిన చోటికే వెళ్ళి మళ్ళీ నుంచున్నా.వాళ్ళు నాకేసి కోపంతో చూసి వనక వొదిలిన చోటికే వెళ్ళి మళ్ళీ నుంచున్నారు. ఆలోచించా ఎందుకనిట్లా ఏడిపిస్తున్నారని. ఒకవేళ ఈ అట్ల పిండి వాసనేమో.కాని మా ఇంట్లో వాళ్ళందరికి చాలా అలవాటే. అదీగాక ఆ వాసన తగిలేటప్పటికి సంతోషం కూడాను. ఈ కాస్త భాగ్యానికే ఇంత హడావిడా ఎంత సుకుమారం అబ్బా అనుకున్నా.
రైలంతా కిక్కిరిసి వుంది. నేనెక్కిన పెట్టెలో ఆ వూరి వాళ్ళెవరూ ఎక్కలేదు. వాళ్ళు కనిపెట్టే వున్నారు. నేనెక్కడ యెక్కుతానో చూస్తో.
నేనెక్కిన చోట ఇది వరకే పదిమంది వున్నారు. చోటు లేదన్నారు. కాని నా తప్పాల ముందు తోసి, వెనకాల నేనూ ఎక్కాను. తప్పాల పైన బల్లమీద పెట్టి, రెండు నిమిషాలయింది ఒక ముసలాయన ఇటు అటు కదలడం మొదలు పెట్టాడు. “చాలా ఉక్కగా వుందండీ యిక్కడ ” అని పెద్ద ట్రంకోటి మోసుకుని బయటికి బయలుదేరాడు.”ఇంకో చోట అసలు ఒకరి మీద ఒకరు నుంచున్నారండి” అన్నా ఆగలా. రెండో లావాటాయన కూడా లేచి వెనకాల వెళ్లాడు. ఒకర్ని ఒదిలి ఒకరు ఉండలేరు గాబోలు అనుకొని హాయిగా సర్దుకున్నాము. ఇంతలో తక్కిన వారందరూ “హూ,హూ” అని ముక్కుల్తో అనడం మొదలుపెట్టారు. ఒకాయన మీద తెల్లని బొట్టుపడ్డది, పైకి చూస్తే తప్పాల్లో పిండి కారుతోంది.బండి అంతా పరిమళం.అఠాత్తుగా ఒకమాటైనా ఆడకుండా, నలుగురు లేచి బస్తాలు, ట్రంకులు దింపుకుని బయిటికి నడిచారు. మిగిలిన వాళ్ళం హాయిగా కాళ్ళు జాచుకున్నాం. మిగిలిన వాళ్ళల్లో ఒక బ్రాహ్మడు , శవాలు మోసే వాడిలాగున్నాడు. ” కుళ్ళిన పసిపిల్ల శవం వాసన” అన్నాడు. ఆ మాటల్తో అదిరిపడి , ఇంకా ముగ్గురు లేచి, ఒకళ్ళకాళ్ళకి ఒకళ్ళు అడ్డం పడుతో, బండిలోనుంచి కిందికి దొర్లారు. రైలు కదుల్తోంది. ఆఖరికి ఆ బండికల్లా నేనూ పచ్చకోటాయనా మిగిలాము. “ఏమిటండీ ఈ కొంచానికి యింత అడావిడి చేస్తారు వీళ్ళు, అంతావేషం !” అన్నాడు. ఆయనకి చాలా జలుబు చేసింది. కాని రైలు బయలు దేరినా కాసేపటికల్లా , ఒక్కసారి గాలి రివ్వున కొట్టేటప్పటికి, చాలా బాధపడడం మొదలుపెట్టాడు. ఆ జలుబూ గిలూబూ వొదిలి పోయింది. ఆ తరవాత స్టేషనులో కాఫీ తాగొస్తానని దిగి ఇంకొ బండిలొ ఎక్కేశాడు. చాలా నీచమయిన పని చేశాడనుకున్నా.
తరువాత , బండీ అంతా నాదే . ప్రతి స్టేషనులో మనుషుల్ని హాయిగా వొక్కణ్ణి అటూ ఇటూ చూస్తే నిశ్చింతగా కూచున్నా నన్నూ నా బండిని చూసి, కళ్ళుకుట్టి, “ఒరేయ్ శంకరయ్యా ! కాళీ బండిరా. ఇట్లారా.” అని ట్రంకులూ. సంచులూ మోసుకొచ్చి తలుపు తెరిచి మెట్లెక్కి ముక్కుతో ఇటు అటూ వూది , బండికేసి నా మొహం కేసి, చూసి అమాంతం వెనకాల వాళ్ళమీద విరుచుకుపడేది.అందరూ అంతే. ప్రతి స్టేషను దగ్గిరా అంతే. ఏమెరగనట్టు అటు కేసి మొహం తిప్పేసి కూచున్నా రయిలు కదులుతున్నా, అట్టే వుండిపోయినారుగాని , నా బండిలో మాత్రం ఎక్కలేదు.
గిన్నె దించుకుని, హాయిగా గోదావరి స్టేషన్ లో దిగాను. కూలీ మా యింటిదాకా ఒక అణాకి గిన్నె మోసుకొస్తానన్నాడు. గిన్నె నెత్తిమీద పెట్టాను. దించాడు”రానండి ” అని, వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్నా ఇంకోడు ఆలోచించి, రెండణాల కొస్తానన్నాడు.గిన్నె నెత్తిన పెట్టుకున్నాడు.కష్టంతో బళ్ళదాకా నడిచాడు. దింపాడు. ” నాచేతి కాదండి బాబూ” అని వెళ్లాడు. “పావలా యిస్తానని” కేకేశా మాట్లాడకుండా నెత్తిమీద గుడ్డ తీసుకుని, వాసన చూసుకుంటూ, పోతున్నాడు.
ఆఖరికి అర్థరూపాయికి బండి మాట్లాడుకొన్నాను, వాడు మాత్రం వొదలదలుచుకోలా. అసలు రెండణాల మామూలు మా చెల్లెలిగారింటికి, ఒక నిముషం తరువాత “బాబూ కేవు చాలదు. ముప్పావలా యిప్పించాలి” అన్నాడు. కొంచెం దూరం తోలాడు. ” ఒక రూపాయి యిచ్చినా కష్టం చాలదు” అని ఆపాడు . ఏం కష్టం అది అతనికే తెలియాలి. ఎంత కష్టంగా లేకపోతే , అంత నశ్యం పీలుస్తాడు. సరేనన్నా, ఏం చెయ్యను, అంతకంటే . మళ్లీ రూపాయిన్నార కావాలి అనబోతున్నాడు. ఇంతలో గోదావరి మీద నించి గాలి విసరింది ఎద్దువైపు. ఎద్దు పరుగు మొదలు పెట్టింది. గుర్రం పనికి రాదు. వెనకనించి ఏం వస్తుందనుకొన్నదొ , ఏమిటో బండి ఎవరి మీదనించన్నా పోతుందనుకొన్నా, కాని బండిరాకముందే, గాలి తగలగానే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఇళ్ళల్లోనికి ,దుకాణాల్లోకి , పక్క సందుల్లోకి తప్పుకున్నారు.ఇంటి దగ్గర బండి ఆగితేనా… నలుగురు ఎద్దుని పట్టుకున్నారు. ముక్కులవతలికి తిప్పేసి. అప్పటికీ ఆగకపొయ్యేదే…బండివాడు దూకి ఎద్దు ముక్కుకు గుడ్డ కప్పేసి, నశ్యం వాసన చూపించకపోతే… ఇంటిలోపలికి వెళ్ళాను గిన్నా నేనూ. చెల్లెల్లూ పిల్లలూ పరిగెత్తుకుంటూ ఒచ్చారు “అన్నాయ్యా”అనీ, “మామయొచ్చాడు, మామయ్యొచ్చాడ”నీ గదిలోకి. గుమ్మం దగ్గిర అందరూ తటాలున ఆగారు. కష్టం మీద మా చెల్లెలు మాత్రం మొహం మీద పమిటకొంగు కప్పుకొని వచ్చి, యేడుస్తో నన్ను కావలించుకొని, “అన్నయ్యా! యెందుకు దాస్తావు చెప్పు నాతో యేం ఘోరం జరిగిందో “అంది. “ఏం లేదమ్మా బామ్మ యిచ్చిన అట్లపిండి”అన్నాను.
బామ్మ రాత్రిక్కూడా రాలేదు. మూడు రోజులు చూశాం రాలేదు. ఏం కదిపితే ఏమవుతుంతో అని ఆ గిన్నె అట్లానే వుంచాం. ఆ తలుపు మాత్రం గొళ్ళెం వేసి, తాళంవేసి , శీలు చేసి, చిల్లుల్లో గుడ్డపేలికలూ అవీ కుక్కాము. ఎవరం ఆ వేపు పోలేదు. నేను స్నానం చేసి, సబ్బుతో కడుక్కున్నాను. కాని ఇంకా బజార్లల్లో నా గాలి తగలగానే మనుషులు, కలెక్టరు మోటారు ముందు తప్పుకునేట్టు, తప్పుకోటం, మానలేదు. రెండు రోజులుండి మాచెల్లెలు , అట్ల ఆశ వదులుకుని ఇంక వూరుకోలేక “ఈ పిండి బామ్మ యేం చెయ్యమంది” అని అడిగింది.”ఒచ్చిందాకా, ముట్టుకోకుండా అట్లానే వుంచమందన్నాను” చెప్పడమెందుకు. దాన్నెవరు కదిలిస్తారంది. మూడు రోజూలూ అయింది. పిల్లలు కొంచెం నలతగా కనబడ్డారు. ఆడూకోరు. అక్కడక్కడ దిగులుగా చతికిలబడతారు. చంటిపిల్ల కారణం లేకుండా మారాం పట్టి యేడుపు. బామ్మకి ఉత్తరాలు రాశాం. రిప్లయి ప్రీపెయిడ్ టెలిగ్రాములిచ్చాం! జవాబు రాలేదు. నాలుగో రోజున మా చెల్లెలంది ” ఒక రూపాయి ఇచ్చి , దీన్నీ అవతల పారేయిస్తే బామ్మ కోప్పడుతుందా” “ఆ, తప్పకుండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంక అట్లు చెయ్యదు. నవ్వదు. మాట్లాడదు. మన మొహం చూడదు, అయినా రూపాయికి ఎవడు పారేస్తాడు. ఒట్టి పీనిక్కి పది రూపాయలు తీసుకుంటాడే “అన్నాడు.
వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు అబ్బాయికి జ్వరం చిన్న పిల్లకి పొంగు మా చెల్లెలికి ఆరో నెలనే నొప్పులు.ఏం చెయ్యం ఎవరితో చెప్పకుండా ఇల్లు తాళం వేసి , సత్రానికి పోయాము.
ఇన్నాళ్ళు మా బావ వూల్లో లేడు. మేము సత్రానికి కెళ్ళిన మర్నాడు వూళ్ళో దిగి ఇల్లు తాళం వేసుంటె మమ్మల్ని వెతుక్కుంటూ వొచ్చాడు. అతని వెనకాల పెద్ద గుంపు . చుట్టుప్రక్కల వాళ్ళందరూ “ఇల్లు తెరుస్తారా లేదా లోపల నూరు కూనీలన్నా జరిగాయి. మరియాదస్తులనుకున్నాను. సత్రానికొస్తే దాగుతుందా!” అని ఒకటే అరుపులు. మునిసిపాలిటీ వారు ఇల్లు తగలపెట్టటానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చెయ్యం జబ్బు పిల్లల్నేసుకొని వెనకాలికెళ్ళాము.
అర్ధరాత్రి నేనూ మా బావ మూతులకి గుడ్డలు కట్టుకుని ఒక సెంటు బుడ్డి మీద గుమ్మరించుకుని ఆ తప్పాల బుజాల మీద మోసుకుంటూ, గోదావరి వేపు బయలుదేరాం. నిద్దర్లో మనుషులు కలవరించారు. కేకలు పెట్టారు. తొందరగా వెళ్ళి, శేషయ్య మెట్టదగ్గిర నావ తీసుకుని నీళ్ల మధ్యకు పోయు గిన్నె పాళంగా గోదావరిలో పడేశాం. నీళ్ళల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కాని మూత తీస్తే, లోపలినుంచి ఏమొస్తుందో, ఏదన్నా విష జంతువు బయలుదేరుతుందేమో అని భయమేసింది. రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తిపోయింది. ఒక్కడూ నీళ్ళు ముంచుకోరు. ఏదో చాలా వుపద్రవం రాబోతుందని వూళ్ళో పుకారు. రైలు బ్రిడ్జి మీద, రూల్సుకి వ్యతిరేకంగా, ముప్ఫై మైళ్ళ వేగంతో పోతూంది. పెద్ద పెద్ద చేపలు చచ్చి తేలుతున్నాయి. కాని ఒక్కరూ వాటిని ముట్టుకోరు . గోదావరి దాటే పిట్టలు పిట్టలు గిరగిర తిరిగి నీళ్లల్లో పడుతున్నాయి. చివరికి పడవలూ, వలలూ వేసుకుని , గోదావరికి కెలికి ,గిన్నెని పట్టి బయటీకి తీసారు. యెట్టా కనుక్కున్నారో , ఏమో హాయిగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదికి అర్థరాత్రి హఠాత్తుగా మెళుకువ వొచ్చింది. వూపిరి పీలవడం అసాధ్యమై తంటాలు పడ్డాం. వెంటానే లేచి లాంతర్లు వెలిగించి ఆ వుపద్రవం ఏమిటని వెడితే, అరుగు మీద ఆ గిన్నె వుంది. వెంటనే ఆ గిన్నెని తీసుకెళ్లి వూరి బయట దూరంగా స్మశానంలో నిలువు లోతున గుంట తీసి పాతిపెట్టించాము. మర్నాటికి కలెక్టర్ కీ, ఛైర్మన్ కీ పెద్ద మాన్ స్టరు అర్జీలు వెళ్ళాయి. వాసనకి దయ్యాలన్నీ లేచీ స్మశానంలోంచి లేచి వూళ్లోకి బయలు దేరాయట. మునిసిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి, ప్రాసిక్యూషన్ చేస్తామని బెదిరించి, ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సాంగతి ఆలోచించాము. అనంతపురం లో మేము ఒకరికి అయిదు వేలు బాకీ. ఆయన పేర దీన్ని బంగీకటి పోస్టాఫీసుకు తీసికెళ్లాము. యిరవయి రూపాయల లంచమిస్తేగాని ఆ గుమాస్తా బంగీ తీసుకోలా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకి సెలవు. ఆ సాయంత్రం రైలు గోదావరి స్టేషన్కి అరమైలు ముందే ఆగింది. మరతిప్పినా ఇంజన్ కదలలేదు. చివరికి యేం చేశారో తెలియదు. వార్తా పత్రైకల్లో మాత్రం యెన్నడూ లేనిది అనంతపురంలో ప్లేగుమొదలుపెట్టిందని చదివాము. ఆయన ఇంతవరకూ అప్పుకోసం అడగలేదు. ఆయనకి ఆరుగురు కొడుకులూ పదిమంది మనమలు.
nice and humarous story. simple and gentle sentences framed with easy understandable and humarous words. so that gudipati venkatachalam have been existing in the telugu literary.
పాపం, ఆ అవ్వ ఏమై పోయిందో?
స్మశానంలోంచి దయ్యాలు లేచి రావడం , ఇవన్నీ ఆయనే రాయగలడు…
మీ భామ్మ ఎలా ఉన్నది చలామా?