ప్రజాసాహిత్యాన్ని అధ్యయనం చేసి నేటి సమాజానికి అన్వయించండి!
మానవీయ విలువలతో నూతన ప్రజాస్వామ్యక వ్యవస్థను నిర్మించండి!
“శ్రీశ్రీ శతజయంతి – చెరబండరాజు సంస్మరణ సభ” ను డల్లాస్ నగరం లో జూన్ 27, 2010 తేదిన వ్యాలీరాంచ్ లైబ్రరీలో ప్రజాకళ సాహిత్య పత్రిక –యువ తెలుగురేడియో-తెలంగాణ డెవల్పమెంటు ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు ప్రజలను, మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాం.
దీనిలో భాగంగా “శ్రీశ్రీ వ్యాసాలు” పైన చంద్రహాస్, “శ్రీశ్రీ కవిత్వం” పైన కే.సీ, “ఖడ్గసృష్టి తర్వాత శ్రీశ్రీ, చెరబండరాజు కవిత్వం” పైన ఉదయభాస్కర్ ప్రసంగిస్తారు. విప్లవకవి వరవరరావు, వేణు గోపాల్ ( వీక్షణం సంపాదకులు), ఆడియో ప్రసంగాలుంటాయి, “సామాజిక నేపధ్యం లో కవిత్వం” పైన సాజీ గోపాల్ ప్రసంగిస్తారు. శ్రీశ్రీ రాసిన “మరో ప్రపంచం” నాటికను చైతన్య, శ్రీనివాస్, నసీమ్ , పవన్, త్రిపుర, బృహతి, స్వేచ్చా, వైష్ణవి బృందం వేస్తారు. శ్రీశ్రీ, చెరబండరాజు పాటలను జానకీ గారు పాడుతారు.
తెలుగు కవిత్వాన్ని ప్రజాస్వామీకరించిన శ్రీశ్రీ, వ్యవస్థను సామాజిక-ఆర్ధిక-రాజకీయ కోణంలో విశ్లేషించాడు. మరో ప్రపంచాన్ని నిర్వచించి ఒక సామాజిక పునాది వేసాడు. ఫూడల్ భావజాలంతో భ్రష్టుపట్టిన సాహిత్యరంగం బూజు దులిపాడు. సామాజిక వాస్తవాలు –జనజీవితాలు-మానవీయ విలువలతో నూతన సాహిత్యరంగ భూమిక నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. భ్రస్టుపట్టిన సమాజాన్ని మార్చటం ఎలా? కుళ్ళి పోయిన యీ వ్యవస్థ లో సామాన్యుడికి న్యాయం జరుగుతుందాని శ్రీశ్రీ అన్వేషించాడు. చివరికి సమాజాన్ని మార్చటానికి రాజకీయ ప్రత్యామ్నాయలను సూచించాడు. నాటి మరో ప్రపంచం నుండి నేటి నూతన ప్రజాస్వామిక సమాజం కోసం ఎన్నో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. శ్రీశ్రీ రచనలు అధ్యయనం చేసి, నేటి సమాజానికి అన్వయించుకోవలసిన అవసరం మున్నది.
తన కలం , గళం యీ సమాజాన్ని మార్చడానికి అంకితం చేసిన చెరబండరాజు, చివరి ఊపిరి వరకు పోరాడాడు. దిగంబర కవిత్వ ఉద్యమంలో ప్రస్థానం మొదలు పెట్టిన చెరబండరాజు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసి ప్రశ్నిస్తూ కవిత్వం రాసాడు. విప్లవకవి గా ప్రజా పోరాటాల పాటయ్యాడు. ప్రజల పక్షం వహించినందుకు, తన పాటలతో వేలాది మందిని చైతన్యపరుస్తున్నందుకు, ప్రభుత్వాల నిర్భందం ఎదుర్కొన్నాడు సహజమైన శైలిలో సూటిగా, జనం గొంతుతో పాట కట్టాడు.
“బందిఖానాలల్ల బంధించినారమ్మ
ప్రజల బాగు కొరకు పాట గట్టాడమ్మ
ఎరుపు మామయ్యతో గొంతు కలిపాడమ్మ
నిర్దోషి మీ నాన్న ఖైదీ అయినాడమ్మ”
శ్రీశ్రీ-చెరబండ రాజు సాహిత్యాన్ని అధ్యయనం చేసి వాళ్ళ ఆశయాలను కొనసాగిద్దాం , వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చుదాం. సమాజం మార్చటానికి కృషి చేద్దాం. ప్రజాస్వామిక హక్కులు, మానవీయ విలువలతో ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మిద్దాం. శ్రీశ్రీ- చెరబండరాజు సభకు విజయవంతం చేయడానికి మీ సహాయ సహకారాలను అందించండి. పూర్తి వివరాలకు:
http://prajakala.org/PDF/srisri.pdf
- చైతన్య, విప్లవ్, నసీమ్, సాజీ గోపాల్