- కె. బాలగోపాల్
సెజ్ల కోసం, గనుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న భూసేకరణ వల్ల జీవనం కోల్పోతున్నవారికి ఆ భూసేకరణను, విచ్చలవిడి పారిశ్రామికీకరణను, వ్యతిరేకించమని చెప్తున్న ఉద్యమకారులు ఆ ప్రజలకు మేలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఎదుగూ బొదుగూలేని గ్రామీణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని పట్టణాలలో మెరుగయిన జీవితాన్ని వెతుక్కునే అవకాశానికి అడ్డుపడుతున్నారా? ఒక్కొక్క ఉదంతాన్నీ తీసుకొని నిర్దిష్టంగా బేరీజు వేసినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.
ప్రతీ ఊరిలోనూ కొంత ఎక్కువ భూమి ఉన్నవారూ, ఇప్పటి కే పట్టణాలలో ఉద్యోగము చేసుకుంటున్నవారూ, వ్యాపార రంగంతో పరిచయము, అనుభవము ఉన్నవారు కొందరుంటారు. వారు ఈ భూసేకరణ ప్రక్రియను ఆహ్వానించగలరు, భూములు వదులుకొని డబ్బులు తీసుకొని పట్టణాలలో మరింత సంపూర్ణంగా స్థిరపడగలరు. ఈ చర్చ వారి గురించి కాదు. వారికి ఎవరూ హితవు చెప్పడం లేదు, చెప్పినా వారు వినరు. కాగా, వారినే ప్రభుత్వం ఉదాహరణగా చూపించి, ఇతరులను కూడ వారి బాట పట్టరాదా అని ఒత్తిడి పెడుతుంది. వారు కూడ గ్రామంలో తమకున్న పెద్దరికాన్ని వాడుకొని ప్రభుత్వం తరపున చిన్నజనంపైన ఒత్తిడి పెడతా రు. మన చర్చ ఆ చిన్నజనం గురించి.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రం సమీపంలో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ వారి యాజమాన్యంలో 2640 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం రాబోతున్నది. దానికోసం ఆ కంపెనీకి ప్రభుత్వం అప్పగించిన (దాదాపు) 1900 ఎకరాల భూమిలో రైతుల జిరాయితీ భూమి గానీ భూమి లేని పేదలకిచ్చిన అసైన్మెంట్ భూమిగానీ ఒక్క ఎకరం కూడ లేదు. ఒక్క గుడిసెగానీ పశువుల కొట్టంగానీ లేదు. ఎవరి భూమీ తీసుకోకుండ, ఎవరి ఇల్లూ కూల్చకుండానే పెద్ద థర్మల్ ప్లాంటు నెలకొల్పబోతున్నారు. దానివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
చుట్టుపక్కల భూముల ధరలూ పెరుగుతాయి. భరోసాలేని వ్యవసాయం మానుకొని థర్మల్ ప్లాంటు వల్ల వచ్చే ఉపాధి అవకాశాలు చేపట్టవచ్చు, చుట్టుపక్కల భూములున్నట్టయితే ధరలు పెరిగినాక అమ్ముకొని పలాసలోనో శ్రీకాకుళంలోనో అదృష్టం బాగుంటే విశాఖపట్నంలోనో స్థిరపడి అభివృద్ధి ఫలాలు అందుకోవచ్చు. అందరికీ మేలుచేసే అభివృద్ధి ప్రయోగానికి ఇది చక్కటి ఉదాహరణ అని ప్రభుత్వం అంటోంది.
అయినప్పటికీ స్థానిక ప్రజలలో మెజారిటీ దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు అందుబాట్లో లేని సమాచారం వారికి ఉద్యమకారులు అందిచ్చి ఉండవచ్చునుగానీ వ్యతిరేకించాలన్న నిర్ణయానికి వారే వచ్చారు. దానికి కారణాలు వారే చెప్తారు. ఒకటి, ‘వ్యవసాయానికి పనికి రాని వ్యర్థభూమి’ అని ప్రభుత్వము, కంపెనీ వర్ణించే ఆ భూమిలో 1000 ఎకరాల విస్తీర్ణం గల నీటి వనరుంది. దానిని ‘బీలా’ అనీ, ఆ భూమిని ‘బీలా భూమి’ అనీ స్థానికులు అంటారు.
సోంపేట ప్రాంతంలో తూర్పుకనుమలు సముద్రానికి దగ్గరగా రావటం వల్ల ఇక్కడ తీరప్రాంతం నిడివి తక్కువ. వర్షాకాలంలో కొండచరియల నుంచి వేగంగా వచ్చే వరదనీరు ఈ ఇరుకు ప్రాంతంలోని లోతయిన నేలలలో నిలువ ఉండిపోవడం వల్ల బీలా భూములు ఏర్పడ్డాయి. నాగార్జునవారికిచ్చిన ఈ భూమిలోని వెయ్యి ఎకరాల వైశాల్యం గల నీటి వనరు మాణిక్యాపురం అనే గ్రామానికి చెందిన 300 ఒరియా మాట్లాడే మత్స్య కార కుటుంబాలకు ఏకైక జీవనాధారం. ఇక మీదట అది ఉండదు.
ఆ నీటివనరు నుంచి మోటార్లు పెట్టుకొని 2000 నుంచి 4000 ఎకరాల భూమిలో రెండ వ పంటగా వరిసాగు చేసుకుంటున్న రైతులు 1000 నుంచి 2000 మంది (ఆయా సంవత్సరాలలో నీటి లభ్యత ను బట్టి) ఉన్నారు. ఈ ఆధారమూ పోతుంది. కాగా, థర్మల్ ప్లాంటుకు భారీ పరిమాణంలో అవసరమైన నీళ్లు దగ్గరలో ఉన్న సముద్రం నుంచి తీసుకోబడుతుంది. నిజానికి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా తీరం వెంబడి డజన్ల సంఖ్యలో థర్మల్కేంద్రాలను అనుమతించడం వెనకున్న రహస్యం బంగాళా ఖాతం పుణ్యా న సులభతరమైన ఈ నీటి లభ్యతే. ఈ సౌలభ్యం ముందు అన్ని అభ్యంతరాలూ తేలిపోయాయి.
సోంపేట థర్మల్ ప్లాంటుకు రోజుకు 1 లక్ష 88వేల ఘనపు మీటర్ల నీరు సము ద్రం నుంచి పంప్చేసి తీసుకుంటారని అధికార సమాచారం. ప్లాంటులో ఆవిరయిన నీటిని కూలింగ్ టవర్లలో చల్లబరచి ద్రవీకరణ చేసి తిరిగి ప్లాంటులోనే వాడుకుంటామని అంటా రు గానీ ఇది కొంతమేరకే సాధ్యం అవుతుంది. కొంత నీరు వెనక్కి సముద్రంలోకి పోతూనే ఉంటుంది. దాని ఉష్ణోగ్రత తీసుకున్న నీటి ఉష్ణోగ్రత కంటే 5 లేక 10 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. పంపింగ్ కారణంగా జరిగే నిరంతర సాగర మథ నం వల్ల, నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల తీర ప్రాంతంలో జలజీవాల పునరుత్పత్తి బాగా దెబ్బతింటుంది. అంటే తీరానికి దగ్గరగా చేసే చేపల వేట దెబ్బ తింటుంది. దీని మీద ఆధారపడ్డ కుటుంబాలెన్నో కచ్చితమైన లెక్కలేదుగానీ 10 మత్స్యకార గ్రామాలున్నాయనేది వాస్తవం.
‘వ్యవసాయానికి పనికిరాని వ్యర్థ భూములు’ కంపెనీకి అప్పగించడం వల్ల ఇంతమంది జీవనాధారం ఇంతగా దెబ్బతింటుంది. (పెద్ద మోతాదులో విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సై డ్ గురించి, మెర్క్యురీ గురించి, సాలీనా ఆ ప్లాంటు విసర్జించబోయే 50 లక్షల టన్నుల బూడిద గురించి, వీటి వల్ల రాగ ల రోగాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు. అనుభవంలోకి వచ్చేదాకా ఈ చర్చ చాదస్తంగా భావించబడుతుంది). కోల్పోతున్న ఈ ఉపాధికి మారుగా కంపెనీ కల్పించే ఉపాధి ఏ పాటిది? వారి లెక్కల ప్రకారమే ప్లాంటు నిర్మాణం జరిగే కాలంలో 2500 దాకా మట్టి మోసే కూలీ పనులు లభిస్తాయి.
అదయిపోయిన తరువాత కంపెనీలో 750 ఉద్యోగాలుంటాయి. అందులో సాంకేతిక నైపు ణ్యం, శిక్షణ అక్కరలేనివి ఎన్ని ఉంటా యో కంపెనీ చెప్పలేదు. ఎక్కువ ఉంటే చెప్పేవారు కాబట్టి తక్కువ ఉంటాయనే అనుకోవాలి. ఆ ఉద్యోగాలు సహితం స్థానికులకే ఇప్పిస్తామని ప్రభుత్వాధికారులు ప్రజలకు చెప్తున్నప్పటికీ, ‘యోగ్యతను బట్టి, అవసరాన్ని బట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయం పరిశీలించడం జరుగుతుంది’ అని మాత్రమే కాయితాలలో రాసి ఉంటుంది.
అంతకంటే కచ్చితమైన ఆదేశం ప్రైవేట్ కంపెనీలకు జారీచేసే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఈ మధ్య అనేక తీర్పులలో స్పష్టం చేసింది కూడ. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ వారి థర్మల్ ప్లాంట్ వల్ల స్థానిక ప్రజలు కోల్పోయే ఉపాధి కంటే పొందగల ఉపాధి చాలా స్వల్పం అనేది స్పష్టమే. పోనీ నష్టపరిహారం తీసుకొని పట్టణానికి పోయి దానిని పెట్టుబడిగా మలచుకొని అభివృద్ధిచెందే అవకాశం ఎవరికైనా ఉందా? ఎవరి భూములూ సేకరించడం లేదు కాబట్టి భూసేకరణకు మారుగా నష్టపరిహారం పొందుతున్న వారెవరూ లేరు.
భూమి కోల్పోకపోయినా ఉపాధి గణనీయంగా కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సహా య పునరావాస విధానం (జి వో 68) అంటుందిగానీ చేపల వేట లేక దెబ్బతినబోయే తీరప్రాంత మత్స్యకారులను ఈ కోవకు చెందినవారుగా ప్రభుత్వం గుర్తించడం లేదు. బీలా నీటివనరు నుంచి సాగునీరు పొందుతున్న రైతులనూ గుర్తించడం లేదు. వారి భూముల ధర పెరగడమేమో గానీ ఈ నీటి వసతి కోల్పోవడమే కాక వారికి వేరే ప్రమాదం కూడ ఉంది.
1000 ఎకరాల నీటి వనరు స్థానంలో ఫ్యాక్టరీ కడితే అక్కడికి వచ్చి చేరవలసిన వరద నీరు నలుదిక్కులా పొర్లి ప్రవహిస్తుంది. దీనికి విరుగుడుగా నీటిని మరల్చడం కోసం కాలవ ఒకటి తవ్వి దానిని కొత్తగా తవ్వబోయే చెరువులోకి పారిస్తామని కంపెనీ అంటున్నది. కానీ వారికిచ్చిన 1900 ఎకరాలలో బూడిదను నిలువ ఉంచే చెరువుకే తప్ప ఈ కొత్త చెరువుకు చోటు లేదని వారు పర్యావరణ నివేదికకు జతచేసి న పటాన్నిబట్టి అర్థం అవుతుంది కాబట్టి, వరదనీటి కాలవ నిర్మించడం అంటూ జరిగితే అది సముద్రంలోకి పోతుందనే ది స్పష్టమే. అంటే బీలా నీటివనరు శాశ్వతంగా పోయినట్టే.
ఒక్క మాణిక్యాపురం మత్స్యకారులకు మాత్రమే నష్టపరిహారానికి అర్హులుగా గుర్తింపు లభించినట్టు తెలుస్తుంది. ఆ 300 కుటుంబాలకు నష్టపరిహారంగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ 1 కోటి 80 లక్షలు ఇవ్వజూపుతున్నట్లు వదంతి. అది పెద్ద మొత్తమనిపిస్తుంది గానీ 300తో భాగిస్తే కుటుంబానికి 60 వేలవుతుంది. ప్రభుత్వం జివో 68 కింద ఇచ్చినా దాదా పు అంతే వస్తుంది. ఈ 60 వేలు తీసుకొని ఆ ఒరియా మత్స్యకారులు పలాసకో శ్రీకాకుళానికో పోయి దానిని పెట్టుబడిగా మార్చుకొని పట్టణ జీవులు కాగలరా? 60 వేలు తక్కువనేది కాదిక్కడ విషయం. 2 లక్షలిచ్చినా మాత్రం దానిని పెట్టుబడిగా మార్చి వర్ధిల్లే నేర్పు గ్రామీణులందరిలోనూ ఉంటుందనుకోవడం భ్రమ. నేర్పు కులాన్ని బట్టి ఉండే మన సమాజంలో మత్స్యకారుల వంటి కులాలలో అది మరీ తక్కువ.
ఒక వేళ ఉందనుకున్నా, 300 మంది తలా రెండు లక్షలు పట్టుకొని వ్యాపారం చేసుకుందామని పొరుగున ఉన్న ఒకటి రెండు పట్టణాలకు బయలుదేరితే అందరి ఆకాంక్షలను ఇముడ్చుకునే ఆర్థిక వ్యవస్థ మన దగ్గర లేదు. మగవాళ్లు డబ్బు ఆశకు కొంచెం తొణికినా ఆడవాళ్లందుకే- ఒక్క సోంపేటలోనేకాదు- చాలా కోపంగా ఉన్నారు. వచ్చి న డబ్బంతా మగవాళ్లు ఇక్కడా అక్కడా పెట్టి వృధాగా తగలేస్తే పిల్లలకు తిండి ఉండదని వారి ఆవేదన. అది పూర్తిగా వాస్తవికమైన, హేతుబద్ధమైన ఆవేదన. మరి సోంపేట థర్మల్ ప్లాంటును ప్రజలెందుకు వ్యతిరేకించకూడదు?
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
http://Balagopal.org